హైదరాబాద్ : తెలంగాణ స్వయం పాలనలో మరో మహోజ్వల ఘట్టం ప్రారంభమైందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) పేర్కొన్నారు. ఆదివారం నూతన సచివాలయం 4వ అంతస్థులోని డి-వింగ్ లోని తన చాంబర్లో వేద మంత్రోచ్ఛరణల మద్య కుటుంబ సభ్యుల సమక్షంలో ఆశీనులయ్యారు.
ఈ సందర్భంగా ఐసీడీఎస్ అంగన్వాడీలకు(Anganwadi) పోషకాల సన్నబియ్యం పంపిణీపై తొలిసంతకం (First signature) చేసి బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం , పౌరసరఫరాల శాఖ వి. అనిల్ కుమార్కు అందించారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని (Secretariat) సీఎం కేసీఆర్(CM KCR) ప్రారంభించిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలోని 35,700 అంగన్ వాడీ కేంద్రాల్లోని 15లక్షలకు పైగా పిల్లలకు, మాతా శిశుసంరక్షణలో భాగంగా లక్షలాది బాలింతలు, గర్బిణులకు పోషకాహారాన్ని అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతీనెల కోటి యాభై ఎనిమిదిలక్షల విలువ చేసే 2162 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఐసీడీఎస్(ICDC) కింద అంగన్వాడీలకు అందజేస్తామన్నారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల ఆక్షన్ ప్లాన్పై కూడా మంత్రి సంతకం చేశారు. అణగారిన వర్గాల జీవితాల్లో మహనీయుడు బాబాసాహెబ్ పెనుమార్పులు తెచ్చాడని వెల్లడించారు.
బీసీ ఎంబీసీలకు ఆర్థికంగా చేయూతనందిస్తూ వారి కలలు సాకారమయ్యే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసాగా నిలిచారని అన్నారు. బీసీ కార్పొరేషన్ (BC Corporation)ద్వారా 50వేల నుంచి 12 లక్షల వరకు 60 నుంచి 100 శాతం సబ్సిడీతో రుణాలు అందించేందుకు 303 కోట్లు మంజూరు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా మరో 300 కోట్లను ఈ ఆర్థిక సంవత్సరంలో వెనుకబడిన వర్గాల స్వావలంబన కోసం ఖర్చు చేసే యాక్షన్ ప్లాన్ ఆమోదించడం మరింత ఆనందంగా ఉందన్నారు. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్, సావిత్రి బాయి పూలే అభ్యుదయ యోజన వంటి స్కీమ్ ల కింద ఐఎస్బీ, కాటగిరి 1 నుంచి 3 వరకూ వేలాది బీసీ కుటుంబాలకు రుణాలు అందజేస్తామన్నారు.