హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర విస్తీర్ణం అంచలంచెలుగా పెరుగుతున్నది. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. వందేండ్ల డిమాండ్కు ఇప్పటి నుంచే పునాదులు పడ్డాయి. గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో దాదాపు రూ. లక్ష కోట్లతో మౌలిక వసతుల మెరుగుదల, జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా చర్యలు తీసుకున్నది. పారిశ్రామిక ప్రగతి, ఐటీ పరుగులు, రియల్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న ప్రోత్సహకర విధానాలే కారణమని సుమధుర గ్రూపు సీఎండీ జీ మధుసూదన్ తెలిపారు. స్వరాష్ట్ర పాలనలో హైదరాబాద్ రియల్ రంగంలో వచ్చిన మార్పులు, పెట్టుబడులు, డిమాండ్ తదితర అంశాలపై ‘నమస్తే తెలంగాణ’తో మధుసూదన్ మాట్లాడారు.
తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగం అవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని భయబ్రాంతులకు గురిచేశారు. అలాంటి అనిశ్చితి నుంచి గణనీయమైన అభివృద్ధిని సాధించడానికి రాష్ట్రం వచ్చిన తొలి నాళ్లలోనే సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణం. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రోత్సాహం మరో కారణం. మొత్తంగా హైదరాబాద్లో మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ, దీర్ఘకాలిక ప్రణాళికల ఆమలు, అన్ని వర్గాలకు అందుబాటులో ఇండ్ల నిర్మాణం వెరసి రియల్ రంగం ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఎకరం రూ. వంద కోట్లు దాటిందంటే తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం.
దేశంలోనే అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్లో వెస్ట్ జోన్కే నిర్మాణ రంగం పరిమితం కాకుండా ప్రభుత్వం అన్ని వైపులా నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తున్నది. ఈస్ట్ లుక్ పాలసీతో ఉప్పల్, భువనగిరి వరకు , కండ్లకోయ ఐటీ పార్కుతో మేడ్చల్ వైపు, ఫార్మా, ఫాక్స్కాన్ కంపెనీలతో ఇబ్రహీంపట్నం , హయత్నగర్ వరకు భారీ నిర్మాణాలకు డిమాండ్ ఉంది. మొత్తంగా నలువైపులా అందరికీ అందుబాటులో నివాస గృహాలు అందుబాటులోకి వస్తున్నాయి.
నగరం ఏదైనా అభివృద్ధి చెందిందని చెప్పడానికి అక్కడ దర్శనమిచ్చే ఆకాశహర్మ్యాలే నిదర్శమని చెప్పవచ్చు. మలేషియా, దుబాయ్, సింగపూర్ వంటి దేశాలను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2006 నుంచే ఆకాశహర్మ్యాల సంస్కృతి ఉంది. ప్రజలు కొనుగోలు శక్తి పెరగడంతోనే వాటిని కొనుగోలు చేస్తున్నారు. అందుకే నిర్మాణ సంస్థలు వాటిని నిర్మిస్తున్నారు.
భారత రియల్ రంగంలో ఎన్నారైల డిమాండ్ క్రమక్రమంగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి తర్వాత చాలా మంది ప్రవాస భారతీయులు రియల్ రంగంలో పెట్టుబడులకు ఆసక్తి కనబర్చుతున్నారు. రెసిడెన్షియల్ వైపు మక్కువ చూపుతున్నారు.లగ్జరీ విల్లాలు, లగ్జరీ అపార్ట్మెంట్లు, హైరైజ్డ్ టవర్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. రూపాయితో పోలిస్తే డాలరు విలువ పెరగడంతో మన దేశంలో పెట్టుబడులకు ఇదే మంచి సమయం అని వారు భావిస్తున్నారు. బిల్డర్ల ట్రాక్ రికార్డు, ఆ కంపెనీ బ్రాండ్ వాల్యూ, గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేశారా లేదా అని నిశితంగా పరిశీలించాకే కొనుగోలు చేస్తున్నారు.