హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ప్రజలకు 24 గంటల నిరంతరాయంగా విద్యుత్తు సరఫరాకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు అధికారులను ఆదేశించారు. విద్యుత్తు నష్టాలను తగ్గించుకొని ఆదాయాన్ని మరింతగా పెంచుకునేలా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని, ఈ వానకాలం సీజన్లో ఇబ్బందులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. మింట్ కాంపౌండ్లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో మంగళవారం ఆయన డిస్కం పరిధిలోని ఏడీఈ (అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్), ఆ పైస్థాయి అధికారులు, జీహెచ్ఎంసీ పరిధిలోని ట్రాన్స్కో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 24 గంటల విద్యుత్తు సరఫరాలో ఎలాంటి లోపం తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.