హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ టీ హబ్ రెండో దశ పనులు దాదాపు పూర్తయ్యాయి. అతి త్వరలో దీనిని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ‘ఆవిష్కరణలకు మరింత ఊతమిచ్చే టీ హబ్ రెండోదశ నిర్మాణం దాదాపు పూర్తయింది. 2,000 పైగా స్టార్టప్లకు ఇది నిలయం కాబోతున్నది. దేశంలోనే అతి పెద్ద, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్గా నిలవనున్నది. తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టంను మరింత బలోపేతం చేయనున్నది’ అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విట్టర్లో వెల్లడించారు. 2015లో గచ్చిబౌలిలో నెలకొల్పిన టీ హబ్ ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షించగా, టీ హబ్ 2 హైదరాబాద్ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేస్తుందని ప్రభుత్వ, ఐటీ వర్గాలు ఆశిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ ఆలోచనల మేరకు టీ హబ్ 2ను తీర్చిదిద్దారు. హైదరాబాద్లోని రాయదుర్గంలో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందుకోసం రూ.276 కోట్లు ఖర్చు చేశారు. 2017 జనవరిలో దీనికి శంకుస్థాపన చేశారు. 2019లోనే నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా కరోనా, ఇతర కారణాల వల్ల ఆలస్యమైంది. టెక్నాలజీ ప్రియులతోపాటు, సామాన్యుల ఆలోచనలకు సైతం ఇక్కడ ప్రోత్సాహం లభించనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్ల ఔత్సాహికులు, వారిని ప్రోత్సహించే వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజిల్ ఇన్వెస్టర్లకు ఉపయోగపడునున్నది. ఇక్కడ రూపుదిద్దుకునే ఆవిష్కరణలు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూయర్షిప్ ఫెసిలిటీ వల్ల స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ కల్చర్కు కొత్త ఊపు లభించనున్నది.
టీ హబ్ విజయమే స్ఫూర్తి
కేటీఆర్ చొరవతో 2015 నవంబర్ 15న గచ్చిబౌలిలో నెలకొల్పిన టీ హబ్ సాధించిన విజయం టీ హబ్-2 ఏర్పాటుకు స్ఫూర్తిగా నిలిచింది. అమెరికాలోని సిలికాన్వ్యాలీ, బెంగళూరులోని స్టార్టప్స్ కేంద్రం కంటే మిన్నగా 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని స్థాపించారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ, ఐఎస్బీ, నల్సార్ యూనివర్సిటీ దీనిలో భాగస్వాములుగా ఉన్నాయి. తొలి ఐదేండ్లలో దాదాపు 1,200 స్టార్టప్లకు సహకారం అందించి రూ.1,800 కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. దీని ద్వారా 2,500కుపైగా ఉద్యోగావకాశాలు లభించాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబి సిస్టమ్స్ సీఈవో శాంతన్ నారాయణ్, బయోకాన్ చైర్మన్ కిరణ్ మంజుందార్షా తదితరులు టీ హబ్ను సందర్శించి, యువ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. నేపాల్ ప్రధాని షేర్ బహద్దూర్ దూబే సందర్శించారు. ఇటీవల సందర్శించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (ఐటీ) సైతం ప్రశంసలు కురిపించడం విశేషం.
ప్యారిస్లో అతిపెద్ద ఇంక్యుబేటర్ స్టేషన్ ఎఫ్
ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెం టర్ ‘స్టేషన్ ఎఫ్’ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉన్నది. దీనిని 2016లో 3.65 లక్షల చదరపు అడుగలు విస్తీర్ణంలో నిర్మించారు. ఇది 3,000 పైగా స్టార్టప్లకు అవకాశం కల్పిస్తున్నది. 30 పై గా స్టార్టప్స్ కార్యక్రమాలు, 35 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్, 40 వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, 4 మెంటార్షిప్ ఆఫీసెస్ ఇందులో భాగంగా ఉన్నాయి. ప్రఖ్యాత గూగుల్, యాపిల్, అమెజాన్, ఓవీహెచ్ క్లౌడ్ సంస్థలు మెంటార్గా వ్యవహరిస్తున్నాయి. ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, యూబీఐ సాఫ్ట్, ఎల్వీఎంహెచ్, లోరియల్, ఎంట్రప్రెన్యూర్ ఫస్ట్ వంటి సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.