హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ‘మీరు ఏ పంటలు సాగు చేస్తున్నారు?.. పదే పదే అవే పంటలు సాగు చేసేందుకు కారణాలేమిటి?, పంట ఉత్పత్తులను ఎక్కడ అమ్ముకున్నారు?, ఏ పంటలకు మద్దతు ధర లభించింది?, ప్రభుత్వం భరోసా ఇస్తే ప్రత్యామ్నాయ పంటలకు మీరు సిద్ధమేనా?’ అంటూ వ్యవసాయశాఖ.. రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నది. ప్రతి గ్రామంలో కొంతమందిని ఎంపికచేసి.. పది ప్రశ్నలతో సర్వే చేస్తున్నది. రైతుల ఆలోచనలను తెలుసుకునే పనిలో వ్యవసాయ విస్తరణ అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో గతానికి భిన్నంగా పుష్కలమైన సాగునీరు అందుబాటులోకి వచ్చింది. వానకాలం, యాసంగి సీజన్ అనే తేడా లేకుండా మెజార్టీ రైతులు వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.
పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల సాగు భారీగా తగ్గి.. అనివార్యంగానే మార్కెట్లో వీటి డిమాండ్ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో రైతులను వరిసాగు నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది. ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధంచేస్తున్నది. ఈ అంశంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించేందుకు, మార్కెటింగ్ పరిస్థితులను తెలియజేసేందుకు మార్కెటింగ్ అనాలసిస్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం సీజన్కు ముందే దేశ విదేశాల్లో ఏ పంటలకు డిమాండ్ ఉండబోతున్నది?, ఏ పంటలు సాగుచేస్తే మంచి ధర ఉంటుంది? వంటి అంశాలపై రైతులకు సలహాలు ఇస్తుంది. దీని ప్రకారం రైతులను ఆ పంటల సాగుదిశగా వ్యవసాయ అధికారులు ప్రోత్సహిస్తారు.
ఆయిల్ పామ్, పప్పులకు ప్రోత్సాహం
ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్, పప్పు దినుసుల సాగును ప్రోత్సహిస్తున్నది. ఈ పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉండ టం, మద్దతుకు మించి ధర కూడా వస్తున్నది. వచ్చే నాలుగేండ్లలో 8లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ను సాగుచేసేలా ప్రణాళిక సిద్ధంచేసింది. రెండేండ్లుగా కంది, పెసర, వేరుశనగ, శనగ పంటల సాగును ప్రోత్సహిస్తున్నది. గతంలో కంది కేవలం ఏడు లక్షల ఎకరాల్లో సాగు కాగా.. గత సీజన్లో అది 11 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇక ఇప్పుడు ఏకంగా 20 లక్షల ఎకరాల్లో సాగుచేసేలా ప్రణాళిక రూపొందించారు.