TS EAMCET | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా కాలేజీల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ఎంసెట్ ఎగ్జామ్స్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ బీ డీన్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్ష, మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా సమయానికే ఒక గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. హాల్టికెట్పై పొందుపరిచిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు కేటాయించిన తేదీ, సమయంలోనే పరీక్షలకు అనుమతిస్తామని తెలిపారు. ఆ సమయానికి అటెండ్ కాకపోతే.. ఇతర సెషన్లకు అనుమతించే ప్రసక్తే లేదన్నారు.
మే 10 నుంచి 14వ తేదీ వరకు రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం వేళ 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం వేళ 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్ ద్వారా పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు తెలంగాణ వ్యాప్తంగా 104 సెంటర్లు, ఏపీలో 33 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ తెలిపారు.
ఎంసెట్ ఎగ్జామ్స్ సజావుగా జరిగేందుకు ఎస్పీలు, సీపీలు, విద్యుత్ అధికారులు, ఆర్టీసీ అధికారులు సహకారం అందించాలని కన్వీనర్ కోరారు.