హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): నాన్ బెయిలబుల్ కేసుల్లో ఇన్నాళ్లూ పోలీసుల కండ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్న నేరస్థులు ఇప్పుడు నేరుగా వచ్చి కోర్టుల్లో రీ-సరెండర్ అవుతున్నారు. ఇలా ఒక్క నెలలోనే ఏడుగురు కోర్టుకు రీసరెండర్ కావడం గమనార్హం. తెలంగాణ సీఐడీ విభాగం నాన్ బెయిలబుల్ వారెంట్ల కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఏడీజీ మహేశ్ భాగవత్ నేతృత్వంలోని కోర్టు మానిటరింగ్ సిస్టమ్ (సీఎంఎస్) విభాగాన్ని ఏర్పాటు చేసింది. 88 కేసులను వీరు సవాల్గా తీసుకున్నారు.
తిరుగుతున్న నేరస్థుల్లో 19 మందిని సీఎంఎస్ విభాగం ఎస్పీ రాంరెడ్డి ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. దేశ, విదేశాల్లో ఉంటూ తప్పించుకొని తిరుగుతున్న నేరస్థులను సులువుగా అరెస్టు చేసి కోర్టుకు సరెండర్ చేస్తున్నారు. పలు కేసుల్లో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయి, తప్పించుకు తిరుగుతున్న వారు తిరిగి కోర్టుల్లో లొంగిపోతున్నారు. ఇలా ఈ నెలలోనే ఏడుగురు కోర్టుకు రీసరెండర్ అయినట్టు సీఐడీ ఏడీజీ వెల్లడించారు.