Vikarabad | వికారాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): జిల్లాల పునర్విభజన ప్రక్రియపై పునర్విచారణ చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో వికారాబాద్ జిల్లాలో కొత్త చర్చకు తెరలేసింది. జిల్లాల పునర్విభజన ప్రక్రియను మళ్లీ చేపడితే వికారాబాద్ పెద్ద జిల్లాగా మారనున్నదనే సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మొత్తాన్ని పూర్తిగా వికారాబాద్ జిల్లా పరిధికి తీసుకువచ్చే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గ పరిధి వికారాబాద్ జిల్లాతోపాటు నారాయణపేట జిల్లాలో ఉన్నది. కొడంగల్, బొంరాసుపేట్, దౌల్తాబాద్, దుద్యాల మండలాలు వికారాబాద్ జిల్లా పరిధిలో ఉండగా, కోస్గి, మద్దూర్, గుండుమాల్, కొత్తపల్లి మండలాలు నారాయణపేట జిల్లాలో ఉన్నాయి.
పర్యాటకరంగంతోపాటు అన్ని విధాలుగా వికారాబాద్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు అనుకూలంగా ఉండటంతోపాటు రీజినల్ రింగ్రోడ్డుకు సమీపంలోనే ఉండటంతో కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కూడా జిల్లా పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పరిగి నియోజకవర్గ పరిధిలోని గండీడ్, మహ్మదాబాద్ మండలాలను కూడా వికారాబాద్ జిల్లాలో కలుపనున్నట్టు తెలిసింది. చేవెళ్ల నియోజకవర్గం మొత్తాన్ని కూడా వికారాబాద్ జిల్లాలో విలీనం చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట్ మండలం వికారాబాద్ జిల్లా పరిధిలో ఉండగా, మిగిలిన మండలాలను కూడా వికారాబాద్ జిల్లా పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది.