హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పాటు తర్వాత స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో కొత్త రోడ్లు, భవనాల నిర్మాణం విస్తృతంగా జరిగిందని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. వీటితోపాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అనేక అద్భుత నిర్మాణాలు జరిగాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆర్అండ్బీ శాఖ సాధించిన విజయాలు, పురోగతిపై రూపొందిస్తున్న డాక్యుమెంటరీపై శనివారం ఆయన నూతన సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో పలు సంస్కరణలు చేపట్టారని, భవిష్యత్ తరాల మేలు కోసం ఎన్నో అద్భుత కట్టడాలు నిర్మించారని తెలిపారు. సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్ష, పాలనా దక్షత వల్ల అనతి కాలంలోనే తెలంగాణ యావత్ దేశానికి రోల్ మాడల్గా నిలిచిందన్నారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా అనేక రోడ్లు, వంతెనలు, భవనాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించామని చెప్పారు. స్వరాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో ఆర్అండ్బీ పరిధిలో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే నిర్మాణాలు ఉన్నాయని తెలిపారు. గత తొమ్మిదేండ్లలో కొత్తగా కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలను ఏర్పాటు చేసుకున్నామని, మరో కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని వివరించారు. దేశంలో ఎకడా లేనివిధంగా రూ.139 కోట్ల నిధులతో 100 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, ప్రజల సౌకర్యార్థం అన్ని జిల్లాల్లో రూ.1,650 కోట్లతో సమీకృత కలెక్టరేట్లతోపాటు తెలంగాణ సమాజమంతా గర్వించేలా హైదరాబాద్లో రూ.617 కోట్లతో కొత్త సచివాలయ భవనాన్ని, రూ.585 కోట్లతో 20 అంతస్థుల పోలీస్ కమిషనరేట్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనాన్ని నిర్మించుకున్నామని తెలిపారు. సమీక్షలో ఆర్అండ్బీ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్రావు, సీఈ సతీశ్, మధుసూదన్రెడ్డి, డీసీ దివాకర్, పలువురు అధికారులు, డాక్యుమెంటరీని రూపొందించే సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని స్త్రీశిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో శనివారం సచివాలయంలో ఆమె సమీక్షించారు. తొమ్మిదేండ్లలో గిరిజన సంక్షేమ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో జరిగిన మార్పులను ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖ ద్వారా తండాలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి మొదలు గిరివికాసం, సీఎంఎస్టీఈ వంటి వినూత్న పథకాలు, లబ్ధిదారుల వివరాలతో వీడియోలు, డాక్యుమెంటరీలు సిద్ధం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గం, జిల్లాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, మహిళా ప్రాంగణాలు, వరింగ్ ఉమెన్స్ హాస్టల్స్ వద్ద ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని చెప్పారు.