సిటీబ్యూరో/శేరిలింగంపల్లి, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): కంచే చేను మేసిందన్న చందంగా నేరాలను అరికట్టాల్సిన ఓ పోలీసు అధికారే నేరాలకు పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యాడు. గతంలోనూ ఓ కేసులో లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడి జైలు శిక్ష పడినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోగా, నేరాలనే ప్రవృత్తిగా ఎంచుకొన్నాడు. 2009 బ్యాచ్కు చెందిన కోడాటి రాజేంద్ర ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ విభాగంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల ఓ కేసులో దర్యాప్తు నిమిత్తం రాజేంద్ర పోలీసు బృందం తో ముంబై వెళ్లాడు.
ఈ క్రమంలో సైబర్ నేరస్థుడైన నైజీరియన్ను అదుపులోకి తీసుకోగా అతడి వద్ద ఎండీఎంఏ డ్రగ్స్ లభించింది. నైజీరియన్ను రిమాండ్కు తరలించగా, అతడి వద్ద లభించిన 1,750 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను రికార్డుల్లో చూపకుండా ఎస్సై రాజేంద్ర తన ఇంటికి తీసుకెళ్లాడు. సుమారు రూ.కోటి విలువైన ఈ డ్రగ్స్ను మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం పన్నాడు. ఆదివారం మణికొండ ప్రాంతంలో ఎస్సై రాజేంద్ర తన వద్ద ఉన్న మత్తు పదార్థాలను విక్రయించేందుకు యత్నిస్తూ నార్కోటిక్ (టీ-న్యాబ్) పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డాడు.
ఈ మేరకు టీ-న్యాబ్ పోలీసులు ఎస్సై రాజేంద్రను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 1,750 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకొన్నారు. విచారణ నిమిత్తం కేసును రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. రాయదుర్గం పోలీస్స్టేషన్లో 2013లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో రాజేంద్ర సీజ్ చేసిన ఓ వాహనాన్ని తిరిగి యజమానికి ఇచ్చేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీకి పట్టుబడగా కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. స్టే తెచ్చుకొని మళ్లీ విధుల్లో చేరిన కొద్దికాలానికే డ్రగ్స్ కేసులో తిరిగి అరెస్టయ్యాడు.