తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 10: సృజనాత్మక సాహిత్యాన్ని స్పృశించిన సంగనభట్ల నర్సయ్య తెలంగాణలో గొప్ప సాహితీవేత్త అని తెలుగు వర్సిటీ పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య టీ గౌరీశంకర్ పేర్కొన్నారు. శ్రీ కృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం వ్యవస్థాపక కార్యదర్శి రావిచెట్టు రంగారావు 146వ జయంతిని భాషా నిలయం ప్రాంగణంలోని ఆడిటోరియంలో శనివారం ఘనంగా నిర్వహించారు. రావి చెట్టు రంగారావు తెలుగు భాషా వికాస పురస్కారం- 2022ను సుప్రసిద్ధ వ్యాకరణవేత్త, పరిశోధకుడు డాక్టర్ సంగనభట్ల నర్సయ్యకు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ, తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి నిరంతరం కృషి చేస్తున్న సంగనభట్ల నర్సయ్యకు ఈ పురస్కారం ఇవ్వడం సముచితమని పేర్కొన్నారు. భాషా నిలయంలోని గ్రంథాలను డిజిటలైజేషన్ చేయాల్సిన అవసరం ఉందని పురస్కారగ్రహీత సంగనభట్ల నర్సయ్య ఆకాంక్షించారు. భాషా నిలయం అధ్యక్షుడు నూతి శంకరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో భాషా నిలయం గౌరవ కార్యదర్శి ఉడయవర్లు, తదితరులు పాల్గొన్నారు.