హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా రేషన్ డీలర్లు కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ పోరాటానికి దిగారు. ఇందులో భాగంగానే సోమవారం అన్ని రాష్ర్టాల్లో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ధర్నాలు చేపట్టారు. దీనికి కొనసాగింపుగా రేషన్ డీలర్ల జాతీయ కమిటీ ఆగస్టు 2వ తేదీన చలో ఢిల్లీకి పిలుపునిచ్చింది. పార్లమెంట్ ఘెరావ్ అభియాన్ పేరుతో రాంలీలా మైదానంలో 5 లక్షల మందితో భారీ ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. తమ డిమాండ్లు, సమస్యలను పరిష్కరించాలని ఎన్నో ఏండ్లుగా విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని రేషన్ డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఇస్తున్న కమీషన్ను రూ.70 నుంచి రూ.440కి పెంచాలని, ఈ పెంపుదలను కేంద్రం నియమించిన కమిటీయే సూచించిందని గుర్తు చేశారు. అయినా కేంద్రం కమీషన్ పెంపును అమలు చేయడం లేదని మండిపడ్డారు. తరుగు 1 శాతం మినహాయింపు ఇవ్వాలని, రేషన్ డీలర్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అన్నారు. బియ్యంతో పాటు నూనెలు, పప్పులు, గోధుమలు రేషన్ షాపుల ద్వారానే సరఫరా చేయాలని స్పష్టం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు.