హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని కోఠి ఈఎన్టీ దవాఖానలో 13 రోజుల శిశువుకు వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన హరీస సుల్తానా-షేక్ కలీం దంపతుల కుమారుడు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటంతో నిలోఫర్ దవాఖానకు తీసుకొచ్చారు. పరిశీలించిన అక్కడి వైద్యులు బాబును కోఠి ఈఎన్టీ దవాఖానకు సిఫారసు చేశారు. డాక్టర్ లోక సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో బాబును పరీక్షించిన ప్రత్యేక వైద్యుల బృందం ముక్కురంధ్రంలో ఎముక పెరిగినట్టు గుర్తించింది. ముక్కు రంధ్రాలు మూసుకోకుండా రబ్బర్ ట్యూబ్లు పెట్టి వారంపాటు ఆక్సిజన్ అందించింది. అనంతరం వైద్యులు సుదర్శన్రెడ్డి, కరుణ, వాణి, నాగరాజు, మహేందర్రెడ్డి, నిత్యా, శ్వేత, జోషి బృందం బాబుకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించింది. అక్కడి నుంచి నిలోఫర్కు వెళ్లిన బాబు పూర్తిగా కోలుకొని బుధవారం డిశార్చి అయ్యాడు. ఈ సందర్భంగా నిలోఫర్, కోఠి ఈఎన్టీ వైద్యులకు శిశువు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.