హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): కృత్రిమ గుండె లయ తప్పి అరిథ్మియా అనే ప్రాణాంతకమైన సమస్యతో బాధపడుతున్న రోగికి దేశంలోనే తొలిసారిగా ఏఐజీ వైద్యులు అరుదైన చికిత్స చేసి పునరుజ్జీవం ప్రసాదించారు. ఒక యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ (34) అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిల్యూర్కు గురవటంతో, అతడికి కృతిమ గుండె పంప్ ఇంప్లాంట్ (లెఫ్ట్ వెంట్రిక్యులార్ అసిస్ట్ డివైస్)ను అమర్చారు. కానీ, కొన్ని రోజులుగా హృదయ స్పందనలు క్రమపద్ధతిలో లేక అస్వస్థతకు గురయ్యాడు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఏఐజీ దవాఖానను ఆశ్రయించాడు. సమస్యను గుర్తించిన ఎలక్ట్రోఫిజియాలజీ డాక్టర్ నరసింహన్.. వెంట్రిక్యులర్ టచికార్డియా (వీటీ) ఆబ్లేషన్ చేసి అరిథ్మియాను అరికట్టారు. లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ సహాయంతో చికిత్స పొందుతున్న రోగికి వీటీ ఆబ్లేషన్ నిర్వహించడం దేశలోనే ఇది తొలి సారిగా వైద్యులు పేర్కొన్నారు.
ఊపిరితిత్తుల క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించే ‘కోన్ బీమ్ సీటీ గైడెడ్ లంగ్ బయాప్సీ’ని సికింద్రాబాద్లోని యశోద దవాఖానలో ప్రారంభించినట్టు ఆ దవాఖానల డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 60 శాతం మంది రోగుల్లో ఈ క్యాన్సర్ను చివరి దశలో గుర్తిస్తున్నారని, ఇక నుంచి ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వెల్లడించారు. వ్యాధిగ్రస్తులకు ఇదొక వరం అని అభివర్ణించారు. సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ హరికృష్ణ గొనుగుంట్ల తన బృందంతో కలిసి 3డీ ఇమేజింగ్ ప్లాట్ఫామ్ను ప్రవేశపెట్టగా, ఇది ఆబ్లేషన్, గాయాలను గుర్తించటంతో పాటు థొరాసిక్ సర్జరీ విధానాలను నిర్వహించేలా వైద్యులకు సహాయపడుతుందని డాక్టర్ గంపల విజయకుమార్ వివరించారు.