కన్నాయిగూడెం, జనవరి 8: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో గోదావరి తీరం వెంబడి ఆదిమానవులు ఉపయోగించిన ప్రారంభ జీవుల శిలాజాలను గుర్తించినట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి వెల్లడించారు. స్థానికులు గెర్రగా పిలిచే ప్రాంతం ఒకప్పటి పురాతన సరస్సుగా గుర్తించినట్టు తెలిపారు. వృక్ష శిలాజాలు, స్పటికీకరించని వివిధ రకాల రంగుల్లో చారలు కలిగిన రాళ్లు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ అగెట్తో కూడిన స్ట్రోమటోలైట్ రాళ్లు అనేక వలయాలు కలిగి చేతిలో ఇమిడేంతగా ఉండటం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఈ రాళ్ల గురించి జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాల్రావును సంప్రదించగా.. అవి ఎలాంటి సంధులు లేకుండా పొరలను కలిగి అగెట్ జియోడ్ మధ్య కుహరం పెరుగుదల వంటి సాలైట్ ఉంటుందని వివరించారు. ఇవి ప్రీ కెబ్రియన్ కాలానికి చెందిన కొన్నికోట్ల సంవత్సరాల కిందటివని చెప్పారు. స్ట్రోమాటోలైట్స్ సైనోబాక్టీరియా బ్లూ, గ్రీన్, అల్గేతో ఏర్పడతాయని తెలిపారు.