Kalivikodi | హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): అంతరించిపోతున్న అరుదైన పక్షి జాతుల్లో కలివికోడి ఒకటి. ఎప్పుడో 1871లో విరివిగా కనిపించిన ఈ పక్షి ఆ తరువాత క్రమంగా అంతరించిపోయినట్టు పర్యావరణ ప్రియులు భావించారు. కానీ దాదాపు శతాబ్దం తరువాత 1986 జనవరిలో ఈ పక్షి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా, సిద్దవటం రేంజ్లో ప్రత్యక్షమైనట్టు గుర్తించారు. అప్పటి నుంచి గత మూడున్నర దశాబ్దాలుగా ఈ పక్షి కోసం అన్వేషణ సాగిస్తున్నారు. కానీ ఎక్కడా దాని జాడ కనిపించలేదు. ఈ పక్షి జాతి కోసం కడప జిల్లాలో సుమారు మూడువేల ఎకరాల భూమిని కేటాయించారు.
2013లో అట్లూరు మండలం కొండూరు దగ్గర ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి ఆ పక్షి ఉనికిని కనుగొనేందుకు ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వం 2019లో కలివికోడి పునర్జీవ ప్రాజెక్టును మంజూరుచేసి రూ. 5.73 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు 2023-27 వరకు కొనసాగుతుందని కలివికోడి పరిశోధకుడు జగన్నాథన్ ఇటీవల వెల్లడించారు. రంగు రంగుల ఈకలు.. చిన్నపాటి ఆకారం.. వినసొంపైన కూతలతో ఆకట్టుకునే కలివికోడిని కనుగొనేందుకు దశాబ్దాలుగా తాము చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకు ఫలించలేదని అటవీ అధికారులు చెప్తున్నారు.