హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం సర్వే వేగంగా సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా వరి పంట ఉన్నట్టు తెలిపింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏఈవోలు ప్రతి రైతు వద్దకు వెళ్లి వివరాలు నమోదు చేస్తుండగా, మరో మూడు, నాలుగు రోజుల్లో సర్వే పూర్తవుతుందని వ్యవసాయ శాఖ పేర్కొంటున్నది. సగం జిల్లాల్లో సర్వే పూర్తయినట్టు తెలిసింది. త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి పంపించనున్నది. ఆ తర్వాత పంట నష్టంపై సాయానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. గత నెలలో కురిసిన వర్షాలకు 1.51 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ నిర్ధారించింది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ఎకరాకు రూ.10 వేల చొప్పున సాయం ప్రకటించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం రూ.151 కోట్ల నిధులను విడుదల చేసింది. త్వరలోనే ఈ సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నది.