తెలంగాణలో ఒకవైపు కాంగ్రెస్.. మరోవైపు బీజేపీ సృష్టిస్తున్న రాజకీయ కలుషిత, కల్లోలిత వాతావరణంతో కలత చెందుతున్న ఉద్యమశక్తులు తిరిగి ఏకమవుతున్నాయి. తెలంగాణకు అసలైన రక్షణకవచం కేసీఆరేనని నమ్ముతున్న బుద్ధిజీవులు, ఉద్యమకారులు తిరిగి బీఆర్ఎస్లో చేరుతున్నారు.
పూటకోసారి ఢిల్లీ, గుజరాత్ అధిష్ఠానాల వైపు చూసే పార్టీల్లో.. ఆత్మగౌరవం ఉన్నవారిగా ఇమడలేక వారు బయటకు వస్తున్నారు. ఎన్నికల ముంగిట ఆయా పార్టీలు ప్రజలకు తామేం చేస్తాయో చెప్పడం కన్నా,కేసీఆర్ను దెబ్బకొడితే ఇక తమకు తిరుగుండదన్న ధోరణితో వ్యవహరించడాన్ని కరడుకట్టిన తెలంగాణవాదులుగా వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
స్వామిగౌడ్.. దాసోజు శ్రవణ్, ఏపూరి సోమన్న, పల్లె రవికుమార్, బూడిద భిక్షమయ్యగౌడ్ ఇలా ఎందరో బీఆర్ఎస్ బావుటాను తిరిగి చేతబట్టుకుంటున్నారు. ఇప్పుడు సీనియర్ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి, తెలంగాణ యువజన సంఘాల నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు ఎం రాజేందర్ శుక్రవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
Minister KTR | హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పౌరుషానికి.. ఢిల్లీ, గుజరాత్ అహంకారానికి మధ్య జరుగుతున్న పోటీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవం కావాలా? ఢిల్లీ గులాంలు, గుజరాత్ బానిసలు కావాలో తెల్చుకోవాల్సిన సమయం అసన్నమైందని అన్నారు. కేసీఆర్ ప్రభుతాన్ని ఎందుకు దించాలి? కేసీఆర్ పాలనలో ఏం తక్కువైంది? అని ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో టీడీపీ పొలిట్బ్యూరో స భ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి, కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్జీవో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ బీఆర్ఎస్లో చేరారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరిన నేతలకు కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణను ఆగం చేయాలను చూస్తున్న వారి కుట్రలను భగ్నం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈన కాచి నకల పాలు చేయొద్దు
గద్దలు, తోడేళ్లు, నక్కలు తెలంగాణపై దాడి చేయడానికి ఎదురు చూస్తున్నాయని, ఈన కాచి నకలపాలు చేయొద్దని మంత్రి కేటీఆర్ ప్రజలకు సూచించారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయబోమంటూ అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని రేవంత్రెడ్డి లాంటి వ్యక్తి సవాల్ విసిరడం, హంతకుడే నివాళులు అర్పించినట్టుగా ఉన్నదని అన్నారు. డబ్బులు పంచుతూ దొరికిన రేవంత్రెడ్డి, డబ్బులపై ప్రమాణం చేయడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. ‘నిజాం కబంధ హస్తాల నుంచి తెలంగాణను ఒక గుజరాతీ విడిపించాడని ప్రధాని మోదీ అంటున్నారు. మరో గుజరాతీ అభివృద్ధి నేర్పి స్తా అంటున్నాడు. ఇది తెలంగాణ అస్తిత్వం మీద దాడే. ఇలా దాడి జరుగుతుంటే చూస్తూ ఉందా మా?’ అని ప్రశ్నించారు. ‘దేశంలో ఒక్క తెలంగాణ తప్ప మిగతా రాష్ట్రాలు బీజేపీ, కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. మరి తెలంగాణకు చేతనైన అభివృద్ధి మిగతా రాష్ట్రాలకు ఎందుకు సాధ్యం కావడం లేదు? కేసీఆర్ పరిపాలనలో ఏం తక్కువైంది? టీఆర్ఎస్ పార్టీని సీఎం కేసీఆర్ స్థాపించకపోతే, తెలంగా ణ ఏర్పాటు అనివార్యతను కల్పించకపోతే.. ఇప్పు డు టీ పీసీసీ, టీ బీజేపీ ఉండేవా? రేవంత్రెడ్డికి, కిషన్రెడ్డికి పదవులు ఉండేవా?’ అని నిలదీశారు.
మాది ప్రజల టీం
కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఇంకోవైపు జరిగిన మాట వాస్తవం కాదా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ వచ్చి కాంగ్రెస్కు బీఆర్ఎస్ బీ టీం అంటారు.. రాహుల్గాంధీ వచ్చి బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అంటారు. తాము ఎవరి టీం కాదు. తెలంగాణ ప్రజల ఏ టీం. మోదీ, రాహుల్ ఒకరినొకరు పార్లమెంట్లో కౌగిలించుకుంటారు.. సహకరించుకుంటారు.. కన్ను కొట్టుకుంటారు.. ఇప్పుడు ఇద్దరు కలిసి మమ్మల్ని విమర్శిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్లో మీ రెండు పార్టీలు కలిసి పనిచేయలేదా? మణికొండ, మక్తల్లో చైర్మన్ పదవులను పంచుకోలేదా? బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్, సోనియా గురించి బాగా చెప్పింది రేవంత్రెడ్డి. రాహుల్గాంధీ ఒక ముద్ద పప్పు అన్నది రేవంత్రెడ్డే. మరిప్పుడు రాహుల్ నిప్పు ఎలా అయ్యారు? నాడు బలిదేవత అన్న సోనియాగాంధీ, ఇప్పుడు కాళీమాత ఎలా అయ్యింది? వందల మంది తెలంగాణ బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కొంప ముంచిదే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలను గోస పెట్టింది, అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ’ అని మండిపడ్డారు. రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని 9 నెలల క్రితమే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కొత్తగా ఇప్పుడు రాహుల్గాంధీ వచ్చి కుల గణన చేస్తామని చెప్తున్నారని, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో బీసీ కుల గణన చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ పాలనలో ఏం తక్కువైంది?
కేసీఆర్ పాలనలో ఎవరికి ఏం తక్కువైందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘కరెంటు, తాగు, సాగునీరు బాగైంది. వ్యవసాయం, విద్య, వైద్యం బాగైంది. సంపద, తలసరి ఆదాయం పెరిగింది. భూముల విలువ పెరిగింది. మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎందుకు దించేయాలి? 13 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్లు చేసినందుకు దిం చేయాలా? 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు జమ చేసినందుకు దించేయాలా? రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇచ్చినందుకా? రైతు బం ధు ఇచ్చినందుకా? మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చినందుకా? యాదాద్రి ఆలయాన్ని నిర్మించినందుకా ? తండాలను పంచాయతీలు చేసినందుకా? కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు చేసినందుకా? కొత్త జిల్లాలు చేసినందుకా? మా కంటే బాగా మీరు చేసింది ఏమైనా ఉంటే చెప్పండి. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకోలేదా? ముదిరాజ్, చేనేత, కల్లు గీత కార్మికులను ఆదుకున్నది కేసీఆర్ కాదా? బీసీ బంధు ద్వారా కుల వృత్తులను ఆదుకొంటున్నది కేసీఆర్ కాదా? దళితబంధు ఇస్తున్నది కేసీఆర్ కాదా? మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నది కేసీఆర్ కాదా? ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టిం ది కేసీఆర్ కాదా? చేనేతకు బడ్జెట్ను 200 రెట్లు పెంచింది కేసీఆర్ కాదా? గిరిజనులకు రిజర్వేషన్లు పెంచింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నదని, అంటే ఎమర్జెన్సీ రోజులు తెస్తారా? అని ఎద్దేవా చేశారు. మోదీని బీజేపీ వాళ్లు దేవుడు అంటున్నారని, వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.400 నుంచి రూ.1200 చేసినందుకు మోదీ దేవుడా? అని ప్రశ్నించారు.
పచ్చబడ్డ పాలమూరు: నిరంజన్రెడ్డి
సీఎం కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాలో అద్భుతమైన అభివృద్ధి సాధ్యమైందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. జిల్లాను మరింత అభివృద్ధి చేయడానికి అందరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్లో చేరిన రావుల చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ దూరదృష్టి గల నేత అని ప్రశంసించారు. కేసీఆర్ ప్రభుత్వం బాగా పనిచేసిందని, అందుకే తాను బీఆర్ఎస్లో చేరానని చెప్పారు. మూడో టర్మ్ కూడా కేసీఆర్ సీఎం కావాలన్నదే తన లక్ష్యమని, బీఆర్ఎస్ అభ్యర్థుల విజ యం కోసం కృషి చేస్తానని ప్రకటించారు. జిట్టా బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ ఉద్యమకారులందరు ఒక్క చోటికి రావాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. మ రొక్కసారి మోసపోతే గోస పడుతామని తెలిపారు. టీఎన్జీవో నేత మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ.. ఉద్యోగులను భారతదేశంలో నంబర్ వన్గా ఉండాలన్న లక్ష్యంతో కేసీఆర్ తీర్చిదిద్దారని అన్నారు. బీఆర్ఎస్లోకి వచ్చి ఉద్యోగులు, పెన్షనర్లకు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కేసీఆర్ సూచించారని, అందుకే ఇంకా రెండు సంవత్సరాల సర్వీసు ఉన్నా రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ పీ రాములు, ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, అబ్రహం, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి మంద జగన్నాథం, మాజీ ఎమ్మెల్సీలు ఎం శ్రీనివాస్రెడ్డి, కర్నె ప్రభాకర్, గీత కార్మిక సంస్థ చైర్మన్ పల్లె రవి, వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వారంలో మరో రూ.3 వేల కోట్ల రుణమాఫీ
రైతు రుణమాఫీపై ఎవ్వరూ ఆందోళన చెందొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. రెండో టర్మ్లో రూ.19,445 కోట్ల రుణాలు చేయనున్నామని చెప్పారు. ఇప్పటికే రూ.13,600 కోట్లు మాఫీ అయ్యాయని, మరో రూ.3 వేల కోట్లు వచ్చే వారంలో రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. పేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పారు. కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో ఒక్క మోటరు ఆన్ చేస్తేనే కాంగ్రెస్ నేతలు ఉక్రోశపడుతున్నారని, మొత్తం 31 మోట ర్లు ఆన్ చేస్తే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎద్దేవా చేశారు. ‘ఓటేసేటప్పుడు అన్నీ ఆలోచించండి. రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టాలి అనేది చాలా కీలకం. రేవంత్రెడ్డి పుట్టు పూర్వోత్తరాలు పాలమూరు ప్ర జలకు తెలుసు. మన కంటిని మనమే పొడుచుకోవద్దు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎల్ఐసీ ఏజెంట్లలా ప్రజలను ఒప్పించాలి. ఒకొక ఓటు పోగు చేసి కేసీఆర్కు ఓట్ల దీవెన అందించాలి’ అని సూచించారు.
కేసీఆర్పై పోరుకు ఒక్కటైన మోదీ, రాహుల్
సీఎం కేసీఆర్ వల్ల ఎవరికి అన్యాయం జరిగిం దో చెప్పాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. అడగకముందే ముదిరాజ్ బిడ్డను రాజ్యసభ సభ్యునిగా చేసింది కేసీఆర్ కాదా? ప్రశ్నించారు. ముదిరాజ్లకు రాబోయే రోజుల్లో రాజ్యసభ, మండలి, కార్పొరేషన్ చైర్మన్లలో సముచిత గౌర వం, ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ‘కాంగ్రెస్, బీజేపీకి సీఎం కేసీఆర్ కొరకరాని కొ య్యగా మారారు. అందుకే ఆయనను ఇక్కడే తొక్కేయాలని ఆ రెండు పార్టీలు చూస్తున్నాయి. తెలంగాణ పౌరుషానికి.. ఢిల్లీ, గుజరాత్ అహంకారానికి మధ్య జరుగుతున్న పోటీలో మనమే విజయం సాధించాలి. కేసీఆర్ జాతీయ శక్తిగా ఎదుగుతారని బీజేపీ, కాంగ్రెస్ భయపడుతున్నా యి. దసరా వస్తున్నది.. తెలంగాణకు ఏది మం చిదో ఊళ్లలో చర్చ పెట్టండి. కాంగ్రెస్కు ముఖ్యమంత్రులు దొరికారు. కానీ ఓటర్లు దొరకుతలేరు. ఎవ్వరూ రంది పెట్టుకోకండి. మళ్లీ సీఎం అయ్యే ది కేసీఆరే’ అని పేర్కొన్నారు. రావుల చంద్రశేఖర్రెడ్డి అజాత శత్రువుకు పర్యాయ పదమని ప్రశంసించారు. ఆయన రాకతో మహబూబ్నగర్ జి ల్లాలో బీఆర్ఎస్ బలం మరింత పెరిగిందన్నారు.