హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు సర్వత్రా మద్దతు లభిస్తున్నది. మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ మంగళవారం సీఎం కేసీఆర్కు ఫోన్ చేసి విస్తృతంగా మాట్లాడారు. మతతత్వ శక్తులపై సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ‘రావు సాబ్.. మీరు అద్భుతంగా పోరాడుతున్నారు. మతతత్వ శక్తులపై ఎవరమైనా పోరాటాన్ని కొనసాగించాల్సిందే. దేశ లౌకికవాద సంస్కృతిని, దేశాన్ని కాపాడుకొనేందుకు మేమందరం మీకు అండగా ఉంటాం. మీ యుద్ధాన్ని కొనసాగించండి. మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుంది’ అని దేవెగౌడ ముఖ్యమంత్రితో అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి మీతో సమావేశమవుతానని దేవెగౌడకు తెలిపారు.