హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): డిజిటల్ ప్రపంచంలో ర్యాన్సమ్వేర్ దాడులు పెరగడం కలకలం రేపుతున్నది. పెరుగుతున్న టెక్నాలజీకి పోటీగా ర్యాన్సమ్ వేర్ దాడులు కూడా ఎక్కువవుతున్నాయి. వీటి నియంత్రణకు బలమైన ఫైర్వాల్స్ సాప్ట్వేర్లు తయారు చేస్తున్నా, అందుకు దీటుగా సైబర్నేరగాళ్లు ర్యాన్సమ్వేర్స్ పుట్టిస్తూ సైబర్ దాడులకు పాల్పడుతూ కార్పొరేట్ సంస్థలను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వే రిపోర్టులో 2021వ సంవత్సరంలో కొత్తగా 32 ర్యాన్సమ్వేర్లను గుర్తించినట్లు వెల్లడించారు. ర్యాన్సమ్వేర్స్ గతంలో పోల్చుకుంటే తాజాగా 26 శాతం పెరిగాయని సర్వే నిర్వాహకులు తెలిపారు. సైబర్నేరగాళ్లు ర్యాన్సమ్ దాడులు చేసేం దుకు సరికొత్త దారులను ఎంచుకుంటున్నారని ఇవంటి సంస్థ తన నివేదకలో పేర్కొన్నారు. టెక్నాలజీలో ఉన్న లొసుగులనే లక్ష్యంగా చేసుకొని ఈ ర్యాన్సమ్వేర్లను సృష్టిస్తున్నారని నివేదికలో వివరించారు. కొత్తగా తయారవుతున్న సెక్యూరిటీకి సంబంధించిన సాప్ట్వేర్లలోని 288 లోపాలను గుర్తించిన హ్యాకర్లు. వాటిని ఆసరగా చేసుకొని కొత్త ర్యాన్సమ్ వేర్లను సృష్టిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ లోపాలను డార్క్వెబ్ ఆధారంగాహ్యాకర్లు గుర్తించి, దాని ద్వారా దాడులకు పాల్పడుతున్నట్లు పలు సైబర్సెక్యూరిటీ సంస్థలు విశ్లేషించారు.