హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): చర్మ సంరక్షణ కోసం ఆయుర్వేద ఉత్పత్తులు తయారు చేస్తున్నామని వ్యాపారుల నుంచి సుమారు రూ.1.26 కోట్లు వసూలు చేసిన అంతర్రాష్ట్ర ఆర్థిక మోసగాడిని తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో తలదాచుకున్న రంజిత్ తివారీ 2019 నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. మిరిక్ బయోటెక్ లిమిటెడ్ పేరుతో ఓ షెల్ కంపెనీని ప్రారంభించిన రంజిత్.. దక్షిణభారతంలో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నానని వివిధ రంగుల బ్రోచర్లు చూపుతూ, ఇన్వెస్ట్ చేయాల్సిందిగా తెలంగాణకు చెందిన సింధూర ట్రేడర్స్ యజమానిని నమ్మించాడు.
రూ.36 లక్షల మెటీరియల్ కోసం రూ.6 లక్షలను డిపాజిట్ చేయించుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. అనంతరం రాజీవ్ సక్సేనా, హిమాన్షు ఉపాధ్యాయ, రంజిత్ అవధేశ్ తివారీ, రంజిత్ కుమార్ తివారీ వంటి పేర్లు మార్చుకొని పలువురి దగ్గర ఇదే విధమైన మోసాలకు తెగబడ్డాడు. బాధితులు 2019లో తెలంగాణ సీఐడీ పోలీసులను ఆశ్రయించడంతో మోసగాడి కోసం గాలింపు చర్యలు చేపట్టి, ఈ నెల 20న చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టగా పలువురి వద్ద నుంచి రూ.1.26 కోట్లకు పైగా సేకరించి మోసాలకు పాల్పడ్డట్టు అంగీకరించాడు. రంజిత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులను తెలంగాణ సీఐడీ ఏడీజీ మహేశ్ ఎం భవగత్ అభినందించారు.