హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర (Ujjaini Mahankali Bonalu) వైభవంగా జరుగుతున్నది. అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా కీలక ఘట్టమైన రంగం (Rangam) కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత (Swarnalatha) భవిష్యవాణి (Bhavishyavani) వినిపించారు. ‘ప్రజలు చేసిన పూజలు సంతోషంగా అందుకున్నా. గతేడాది మీరు ఇచ్చిన వాగ్దానం మరిచారు. కావాల్సిన బలాన్ని ఇచ్చాను.. మీవెంటే నేను ఉంటా. వర్షాలు తప్పనిసరిగా వస్తాయి. మీరు భయపడవద్దు.
ఆలస్యమైనా వానలు తప్పనిసరిగా వస్తాయి. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దు. ఐదు వారాలు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలి. ఏ పూజలు చేసినా సంతోషంగా అందుకుంటున్నా’ అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కాగా, రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.