హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తేతెలంగాణ): గత రెండేండ్లలో మున్సిపల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల ఆధ్వర్యంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద నాటిన మొక్కల్లో బతికిన వాటి సంఖ్యను తేల్చేందుకు రాండమ్ సర్వే నిర్వహించాలని అటవీశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధివిధానాలపై సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు సర్వే చేయాలని సూచించారు. జిల్లా అటవీ అధికారి నేతృత్వంలో కమిటీలను ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో ఒక అటవీ అధికారితోపాటు సంబంధిత శాఖల నుంచి ఒక్కో అధికారి సభ్యుడిగా ఉంటారు. గత రెండేండ్లు (2019, 2020)లో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను ఈ బృందాలు పరిశీలించనున్నాయి. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి సరైన వివరాలను నివేదిక రూపంలో అందించాలని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ శోభ అధికారులను కోరారు. ఈ సమావేశంలో పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్) ఆర్ఎం డోబ్రియల్, మున్సిపల్శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీరాజ్ స్పెషల్ కమిషనర్ ప్రసాద్, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు, పంచాయతీరాజ్శాఖ అధికారులు, జిల్లా అటవీ అధికారులు పాల్గొన్నారు.