శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చిన సందర్భంలో నీటిని తరలించేందుకు 1991లో వరద కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 122 కిలోమీటర్ల పొడవు 22,500 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో మొదలుపెట్టిన కాలువ నత్తనడకన సాగుతూ, ఎట్టకేలకు 2007 నాటికి పూర్తయ్యింది. ఎస్సారెస్పీని పట్టించుకునే నాథుడు లేకపోవడంతో వరద కాలువ వట్టిపోయింది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల రైతులకు దశాబ్దాల తరబడి సాగునీటి గోస తప్పలేదు.
స్వరాష్ట్ర సాధన తర్వాత 2017లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని చేపట్టారు. రూ. 1720 కోట్ల వ్యయంతో నిజామాబాద్ జిల్లా ముప్కాల్, జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట, మల్యాల మండలం రాంపూర్ దగ్గర పంప్హౌస్లు నిర్మించి వరద కాలువను ఓ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చారు. ఒకప్పుడు చుక్కనీటి జాడ లేని వరద కాలువ నేడు ఏడాది పొడవునా జలకళతో గలగల సవ్వడి వినిపిస్తున్నది.