ములుగు, జూలై 2 (నమస్తే తెలంగాణ): ప్రపంచ వారసత్వ సంపదగా ఖ్యాతి గడించిన రామప్ప చుట్టు పక్కల ప్రాంతాల్లో బొగ్గు తవ్వకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వొద్దని రామప్ప పరిరక్షణ సమితి కన్వీనర్ వెంకటరామ్మోహన్రావు కోరారు. రామప్ప ఆలయాన్ని, సరస్సును పరిరక్షించాలని సూచించారు.
గురువారం ఆయన ములుగులో మీడియాతో మాట్లాడుతూ.. రామప్ప శివారులో ఓపెన్ కాస్ట్ కార్యకలాపాల వల్ల ఆలయంతోపాటు సరస్సుకు హాని జరిగే అవకాశం ఉన్నదని అన్నారు. క్రీ.శ. 1213లో నిర్మించిన రామప్ప ఆలయానికి 800 ఏండ్ల చరిత్ర ఉన్నదని, బొగ్గు తవ్వకాల వల్ల ఆలయం దెబ్బతినడంతోపాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో పనిచేసే సింగరేణి చేపడుతున్న మైనింగ్ తవ్వకాల వల్ల రామప్ప ఉనికికే ప్రమాదం పొంచి ఉన్నదని తెలిపారు.