కలలోనైనా కనిపించి కండ్లు తెరిపించు!!
జాతి నిర్మాణంలో రాష్ర్టానిది కీలకపాత్ర
అయినా తెలంగాణపై మోదీ సర్కారు కక్ష
సమ న్యాయం చేయాలనే ఉద్దేశమే లేదు
అంబేద్కర్ నినాదమే సీఎం కేసీఆర్ విధానం
పాలమూరు పర్యటనలో మంత్రి కేటీఆర్
మహబూబ్నగర్, ఫిబ్రవరి 4 : ఆధునిక భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ రాష్ర్టానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నదని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. అన్ని రాష్ర్టాలకు సమ దృష్టితో న్యాయం చేయాలనే ఉద్దేశమే కేంద్ర ప్రభుత్వానికి కనిపించడంలేదని మండిపడ్డారు. సమతామూర్తి శ్రీ రామానుజాచార్యులు ప్రధాని మోదీకి కలలో కనిపించి సమతా ధర్మాన్ని బోధిస్తే బాగుండునని ఆకాంక్షించారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో రూ.3 కోట్లతో అభివృద్ధి చేసిన జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతున్న తెలంగాణకు కేంద్రం నుంచి సహకారమే కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో తెలంగాణ భౌగోళికంగా 11వ స్థానంలో, జనాభా ప్రకారం 12వ స్థానంలో ఉన్నా ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడుతున్న రాష్ర్టాల్లో నాలుగో స్థానంలో ఉన్నదని రిజర్వ్ బ్యాంకు నివేదికలే స్పష్టం చేశాయని గుర్తుచేశారు. పేదరికంలో ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ర్టాల్లో జాతి నిర్మాణంలో భాగస్వామ్యమవుతున్నది తెలంగాణ ప్రజల చెమట, రక్తమేనని తెలిపారు. అలాంటి తెలంగాణకు అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? అని ప్రశ్నించారు.
అంబేద్కర్ నినాదమే కేసీఆర్ విధానం
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై సీఎం కేసీఆర్ మాట్లాడితే ప్రతిపక్ష నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బోధించు, సమీకరించు, పోరాడు అన్న అంబేద్కర్ నినాదమే స్ఫూర్తిగా కేసీఆర్ 14 ఏండ్లపాటు ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని బోధించి, లక్షల మందిని సమీకరించి పోరాడారని తెలిపారు. ‘రాజ్యాంగాన్ని పాలకులు దుర్వినియోగం చేస్తే దానిని తగులబెట్టడంలో నేనే ముందుంటా’ అని అంబేద్కర్ స్వయం గా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ‘కేంద్రంలోని ప్రభుత్వాలు ఇప్పటి వరకు 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించాయి. మాజీ ప్రధాని వాజపేయి రాజ్యాంగ సమీక్షకు కమిటీ వేశారు. ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భాగవత్ కొత్త రాజ్యాంగం కావాలని కోరారు. వీళ్లంతా రాజ్యాంగాన్ని అవమానించినట్టు భావించాలా?’ అని ప్రశ్నించారు. దళితులు, పేదలకు జరిగిన అన్యాయం గురించి సమాధానం చెప్పలేక, విషయ పరిజ్ఞానం లేని కొందరు భావదారిద్య్రంతో విమర్శలకు దిగుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. దళితుల మీద అంత ప్రేమ ఉంటే ఎన్డీయే పాలకులు దేశమంతా దళితబంధు ప్రవేశపెట్టాలని సవాల్ చేశారు.
తెలంగాణకు అన్నింటా అన్యాయమే
సంక్షేమంలో, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో వెయ్యి గురుకులాల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని, ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం ఎలా ఉండేదో అందరికీ తెలుసని, తెలంగాణ వచ్చాక కేసీఆర్ మనుమడు, మనవరాళ్లు తింటున్నట్టుగానే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని సన్న బియ్యంతో అందిస్తున్నామని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం అంబేద్కర్, మహాత్మా జ్యోతిబాపూలే పేరుతో ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇస్తున్నామని గుర్తుచేశారు. విద్యార్థులకు రూ.1,600 కోట్ల ఉపకార వేతానాలు అందిస్తున్న ఘతన తెలంగాణ ప్రభుత్వానిదని అన్నారు. మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కొత్తగా 8 ఐఐఎంలు మంజూరు చేస్తే మనకు ఇచ్చింది గుండుసున్నా అని మండిపడ్డారు. 100 దాకా నవోదయ పాఠశాలలు మంజూరు చేసినా రాష్ర్టానికి మొండిచెయ్యే చూపిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 16 పరిశోధనా సంస్థలను ప్రారంభిస్తే మనకు ఒక్కటీ ఇవ్వలేదని తెలిపారు. విద్యారంగంలో తెలంగాణ పట్ల మోదీ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఓ యజ్ఞంలా భావించి సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంగ్లిష్ మీడియం చదువులతో సమూల మార్పులు రాబోతున్నాయని చెప్పారు. చదువు ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని, దాతలు ముందుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో పాలు పంచుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, జైపాల్యాదవ్, ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ స్ఫూర్తితోనే బడి నిర్మించాం: జనార్దన్రెడ్డి
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో పిల్లలను చదివించేందుకు తల్లితండ్రులు ఎన్నో బాధలు పడుతున్నారని, అలాంటి వారి కోసం కార్పొరేట్ తరహాలో తిమ్మాజిపేట జడ్పీహెచ్ఎస్ను అభివృద్ధి చేశామని నాగర్కర్నూ ల్ ఎమ్మెల్యే, ఎంజేఆర్ ట్రస్ట్ చైర్మన్ మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. ఇందుకు సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం సైతం తమకు స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. కనీస సౌకర్యాలు లేకుండా అప్పట్లో తమ విద్యాభ్యాసం సాగిందని, ఆ లోటు ఇప్పటి విద్యార్థులకు లేకుండా చేసేందుకే బడి నిర్మాణం చేపట్టినట్టు వెల్లడించారు. తిమ్మాజిపేటలాగే 5 మండలాలను దత్తత తీసుకొని పాఠశాలలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. తాడూరు మండల కేంద్రం, సిర్సవాడలోనూ రూ.3 కోట్ల చొప్పున కేటాయించి నిర్మిస్తున్న పాఠశాలల ప్రారంభానికి కూడా మంత్రి కేటీఆర్ రావాలని విజ్ఞప్తి చేశారు. మర్రి జనార్దన్రెడ్డి తన ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. తిమ్మాజిపేట పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని ట్వీట్ చేశారు.