స్వామి పూజనానంద
కవాడిగూడ, ఫిబ్రవరి 26: 23 దేశాలలో 65 మఠాల ద్వారా రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో విద్యాలయాలు, దవాఖానలు, ఆధ్యాత్మిక కేంద్రా ల ద్వారా సేవలు అందిస్తున్నామని స్వామి పూజనానంద వెల్లడించారు. శనివారం హైదరాబాద్లోని రామకృష్ణ మఠంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల బేలూర్ మఠంలో జరిగిన రామకృష్ణ మిషన్ 112వ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలను వెల్లడించారు. ఆస్ట్రేలియా, సిడ్నీ, ఆడిలైడ్, బ్రిస్బేన్, కాన్బెర్రా, మెల్బోర్న్, పెర్త్లో వేదాంత ఉప కేంద్రాలకు అధికారిక గుర్తింపు ఇచ్చారని తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో 2,31,868 మంది విద్యార్థుల కోసం రూ.451.78 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. దవాఖానలు, సంచార వైద్యాలయాలు, క్లినిక్ల కోసం రూ.262 కోట్లు వెచ్చించినట్టు వెల్లడించారు. రూ.262.11 కోట్లతో కరోనా బాధితులకు నిత్యావసరాలు, ఆహారం, దుస్తులు, విపత్తుల నిర్వాసితులకు పునరావాసం కల్పించినట్టు పేర్కొన్నారు. ఆదివాసీలు, గ్రామీణవాసుల విద్య, వైద్యం, సంక్షేమం కోసం రూ.71.62 కోట్లు, బోధన ప్రచురణ కోసం రూ.10.35 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. రామకృష్ణ మిషన్, మఠాలకు సహకారం అందిస్తున్న వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.