హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వ్యంలో సిట్ నిందితుల్ని లోతుగా విచారిస్తోంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం రామచంద్ర భారతి, సింహాయాజి, నందకుమార్ల స్వర నమూనాలను సేకరించారు. స్వర నమూనా సేకరణ పూర్తయిన తర్వాత రాజేంద్రనగర్ ఏసీబీ కార్యాలయానికి వారిని తరలించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో వారి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవాళ ఉదయం చంచల్గూడ జైలు నుంచి నేరుగా నాంపల్లిలోని ఎఫ్ఎస్ఎల్కు తరలించారు. అక్కడ ముగ్గురు నిందితుల వాయిస్ రికార్డు చేశారు. బేరసారాల ఆడియో, వీడియోల వాయిస్తో అధికారులు వాటిని పోల్చి చూడనున్నారు. కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకంగా కానున్నది.
ఏసీబీ కోర్టు అనుమతితో ముగ్గురు నిందితులను గురువారం ఉదయం తమ కస్టడీలోకి తీసుకున్న అధికారులు 42 ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలపై ఉదయం ఒక్కొక్కరిని వేర్వేరుగా, మధ్యాహ్నం కలిపి ప్రశ్నించారు. 17 ప్రశ్నలకు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడారు. వీటిపై శుక్రవారం విచారణలో స్పష్టత తీసుకునేందు కు ప్రయత్నిస్తున్నారు. కస్టడీ పూర్తయ్యాక నిం దితులను చంచల్గూడ జైలుకు తరలించారు.