కథలాపూర్, సెప్టెంబర్ 11: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్కు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రుద్ర రచన సోమవారం రాఖీ కట్టి, శుభాకాంక్షలు తెలిపింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథగా మారిన రచన ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేయడానికి మంత్రి కేటీఆర్ ఆర్థికసాయం అందించిన విషయం తెలిసిందే. సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించిన తర్వాత రచన తన వేతనం నుంచి లక్ష నగదును గత నెలలో సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళం అందించి సీఎం కేసీఆర్, కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపింది.
కాగా, సోమవారం హైదరాబాద్లోని మంత్రి కేటీఆర్ నివాసానికి వెళ్లిన రచన.. మంత్రికి వెండి రాఖీ కట్టి, కేటీఆర్ దంపతులకు నూతన వస్ర్తాలు పెట్టింది. రచనకు మంత్రి కేటీఆర్ వెండి నెమలిని కానుకగా అందించి శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్తో సీఎం కేసీఆర్కు వెండి రాఖీని, నూతన వస్ర్తాలు పంపించినట్టు రుద్ర రచన వెల్లడించింది.