Rajyasabha Elections | హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. తెలంగాణలో 3 స్థానాలకు బరిలో ముగ్గురే మిగలడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్లు మాత్రమే మిగిలాయి.
శ్రమజీవి పార్టీ తరపున జాజుల భాస్కర్, భోజరాజు కోయల్కర్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా కిరణ్ రాథోడ్లు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే ఒక్కో అభ్యర్థికి మద్దతుగా కనీసం 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లపై 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. కానీ మిగిలిన ముగ్గురికి మద్దతుగా ఎమ్మెల్యేలు ఎవరూ సంతకాలు చేయలేదు. దీంతో వారి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి తిరస్కరించారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి అనంతరం ఇద్దరు కాంగ్రెస్, ఒక బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు.