హాలియా, నవంబర్ 20: రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. అందుకు విరుద్ధంగా పని చేస్తూ ఆమె పదవికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా హాలియాలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దేశం సమాఖ్య విధానం అనుసరిస్తున్నదని, కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో గవర్నర్ పాత్ర ఎంతో కీలకమని, అలాంటిది గవర్నర్ తమిళిసై మాత్రం రాజ్యాంగ హోదాలో ఉన్న విషయాన్ని మరిచి బీజేపీ కార్యకర్తలాగా వ్యవహరించడం బాధాకరమన్నారు.
గతంలో బీజేపీ కార్యకర్తలు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అనుచరులు ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేస్తే కనీసం స్పందించని గవర్నర్.. ఇప్పుడు అర్వింద్ ఇంటిపై దాడిచేస్తే వెంటనే స్పందించి ప్రభుత్వం నుంచి నివేదిక కోరడం సరికాదన్నారు. గత కొంతకాలంగా ఎంపీ అర్వింద్ సీఎం కేసీఆర్, మంత్రులను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడటం, ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఏకవచనంతో సంబోధించడం సరికాదని దుయ్యబట్టారు.