Wanaparthy | వనపర్తి, జూలై 22: ‘ఉపాధ్యాయ వృత్తిలో రిటైర్డ్ అయిన తరువాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో బయటకు రాలేకపోయిన. రెండ్రోజుల కిందట మా పిల్లలు వనపర్తి అభివృద్ధికి సంబంధించిన డాక్యుమెంటరీని చూపించారు బిడ్డా. దాన్ని చూసి ఆశ్చర్యపోయిన. వనపర్తి ఇంతలా అభివృద్ధి జరిగిందంటే ఊహించలేదు. నాటి వనపర్తికి.. నేటికీ చాలా తేడా ఉంది. నాడు వనాలపర్తిగా ఉన్న వనపర్తిని నేడు విద్యాలయాలకు నిలయంగా మార్చావు. నీవు చేసిన అభివృద్ధి పనులపై తీసిన డాక్యుమెంటరీని చూసి చాలా ఆనందపడ్డాను. కవిత కూడా రాశాను’ అంటూ రిటైర్డ్ టీచర్ రజిత మంత్రి నిరంజన్రెడ్డితో ముచ్చటించింది. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం ముగించుకొని వెళ్తున్న క్రమంలో రజిత కుటుంబసభ్యులు మంత్రిని కలిశారు.
‘రజిత.. మిమ్మల్ని చూడాలనుకుంటున్నది’ అని స్థానిక బీఆర్ఎస్ నాయకులు మంత్రికి చెప్పడంతో ఆయన ఆమె ఇంటికి వెళ్లారు. చిన్నమ్మా.. బాగున్నావా అంటూ ఆప్యాయంగా పలుకరించారు. ‘వనపర్తిని ఇంకా చాలా అభివృద్ధి చేస్తావన్న నమ్మకం నాకు ఉన్నది’ అని రజిత మంత్రికి చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు వనపర్తి అభివృద్ధికి చెందిన డాక్యుమెంటరీని తెలంగాణ ఎన్నారైలకు చూపించానని, వాళ్లంతా పక్కనే ఉండి వనపర్తిని చూసినట్టున్నదని భావోద్వేగానికి గురయ్యారని గుర్తు చేశారు. అభివృద్ధి చేస్తే ఏ నాయకుడినైనా ప్రజలు మనసులో ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు పెట్టుకోకుండా ఆదరిస్తారని చెప్పారు. అనంతరం వార్డులో ఉన్న చిన్నారులతో మంత్రి కాసేపు మాట్లాడి ఫొటోలు దిగారు.