హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబర్చిన పోలీస్ స్టేషన్గా రాజేంద్రనగర్ పీఎస్ నిలిచింది. శుక్రవారం రాజస్థాన్లోని జైపూర్లో నిర్వహించిన డీజీపీల సదస్సులో ఎస్హెచ్వో బీ నాగేంద్రబాబుకు కేంద్ర హోం మంత్రి అమిత్షా ఉత్తమ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా నాగేంద్రబాబుకు సీఎం రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు మొదటి స్థానం రావటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇది తెలంగాణ పోలీసుల విజయం అని డీజీపీ రవిగుప్తా తెలిపారు. 17 వేలకుపైగా పోలీస్ స్టేషన్లను వెనక్కినెట్టి తెలంగాణ తొలిస్థానంలో నిలవటం మనకు గర్వకారణమని తెలిపారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ రకాల కేసుల దర్యాప్తు జరిగిన తీరు, స్టేషన్ నిర్వహణ, మహిళలపై కేసుల దర్యాప్తు, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్ సేఫ్టీ వంటి పలు అంశాలను ఇదేస్ఫూర్తితో కొనసాగించాలని నాగేంద్రబాబుకు సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్లు రాజేంద్రనగర్ పీఎస్ పనితీరును ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అడిషనల్ డీజీ శిఖాగోయెల్, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, నాటి డీసీపీ జగదీశ్వర్రెడ్డి.. రాజేంద్రనగర్ పీఎస్ సిబ్బందిని అభినందించారు.