హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన బీసీ అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించి బీసీల ఐక్యతను చాటాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పిలుపునిచ్చారు. బీసీలను అవమానపర్చిన వారికి బుద్ధి చెప్పి, లోక్సభ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటాలని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 12 జనరల్ సీట్లలో ఆరు సీట్లను బీసీలకు కేటాయించిందని చెప్పారు.
చేవెళ్లలో ఇతర పార్టీలు అగ్రవర్ణాలకు అవకాశం ఇచ్చినా బీఆర్ఎస్ బలహీన వర్గాలకు చెందిన కాసాని జ్ఞానేశ్వర్ను బరిలో నిలిపిందని అన్నారు. బీసీల కోసం మూడు నాలుగు దశాబ్దాలుగా కాసాని పోరాడారని అన్నారు. కాంగ్రెస్ నేత మోహన్రెడ్డి దురహంకారాన్ని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఖండించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బీసీ సంఘాలు ఇప్పటికైనా నిద్ర లేవాలని, జ్ఞానేశ్వర్ను గెలుపునకు ప్రయత్నించాలని కోరారు. చేవెళ్లలో కచ్చితంగా గెలుస్తామని, బీసీల దమ్ము చూపిస్తామని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
తనకు పార్టీ మారాలనే ఆలోచనే లేదని, పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండిస్తున్నానని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. తన మనుమరాలి పెళ్లి కోసమే సీఎం రేవంత్రెడ్డిని కలిశానని వివరణ ఇచ్చారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, కేసీఆర్తోనే పయనిస్తానని స్పష్టం చేశారు.సమావేశంలో బీఆర్ఎస్ నేతలు నాగేందర్ గౌడ్, మల్లేశ్ ముదిరాజ్, పురుషోత్తం, రాందాస్ పాల్గొన్నారు.