హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): శాసనసభలో ముఖ్యమంత్రి సహా అందరూ సమున్నతంగా గౌరవించాల్సిన స్పీకర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఒక మరమనిషిలా వ్యవహరిస్తున్నారని.. ముఖ్యమంత్రి ఎలా చెప్తే అలా చేస్తున్నారే తప్ప వేరే పని చేయడంలేదని తీవ్రమైన ఆరోపణలు చేశారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కు తున్నారని విమర్శలు చేశారు.
క్షమాపణ చెప్పాలి: మంత్రి వేముల
అత్యున్నత స్థానంలో ఉన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని ఈటల రాజేందర్ మరమనిషితో పోల్చటాన్ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రంగా పరిగణించారు. స్పీకర్పై చేసిన వ్యాఖ్యలపై ఈటల బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఈటలపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాజేందర్
అహంకారంతో మాట్లాడుతున్నారని ఒక ప్రకటనలో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తనకు 20 ఏండ్ల సీనియారిటీ ఉన్నదని చెప్పుకొనే ఈటల స్పీకర్ స్థానాన్ని అగౌరవపరుస్తూ మాట్లాడటం విచారకరమన్నారు. తన సీనియారిటీలో ఈటల నేర్చుకున్నది ఇదేనా అని ప్రశ్నించారు. స్పీకర్ తన బాధ్యతలను నిబంధనల మేరకు చకగా నిర్వహిస్తున్నారని, సభ్యుల సంఖ్యను బట్టే బీఏసీలో పార్టీలకు అవకాశం ఇవ్వాలని గతంలోనే నిర్ణయం తీసుకొన్నామని చెప్పారు. ఈటల మంత్రిగా ఉన్నప్పుడు కూడా బీఏసీలో బీజేపీకి అవకాశంలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నీతులా…
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్న బీజేపీలో ఉన్న ఈటలతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదని మంత్రి వేముల అన్నారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ దిగజారుస్తున్న బీజేపీ.. చివరకు స్పీకర్ వ్యవస్థను కూడాఅవమాన పరుస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఏ రాష్ట్ర అసెంబ్లీకైనా.. వేర్వేరుగా నిబంధనలు ఉంటాయన్న కనీస అవగాహన ఈటలకు లేకపోవడం దురదృష్టమన్నారు. తెలంగాణ ఆవిర్భవించగానే నిబంధనలు మార్చుకున్న సంగతి ఈటలకు తెలియదా? అని ప్రశ్నించారు. వార్తల్లో ఉండటానికే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈటలకు శాసనసభ్యుడిగా సీనియారిటీ ఉండొచ్చు కానీ సభాపతి పట్ల సిన్సియారిటీ కూడా ఉండాలని హితవు చెప్పారు. స్పీకర్ను అవమానపరిస్తే మొత్తం అసెంబ్లీని అవమానించినట్టేనన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈటలను డిమాండ్చేశారు. లేకుంటే ఆ స్థానం గౌరవాన్ని కాపాడేందుకు తాము సభా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని మంత్రి వేముల వెల్లడించారు.