తెలంగాణ చౌక్(సిరిసిల్ల), ఆగస్టు 15 : రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు అత్యంత ప్రాధన్యాతనిస్తూ, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ఆవరణలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘బస్సులో భరోసా’ కార్యక్రమంలో భాగంగా బస్సులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ పోలీస్ శాఖ శాంతి భద్రతల నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తున్నదని కొనియాడారు. సీసీ టీవీల ద్వారా నేర నియంత్రణలో దేశం మొత్తంలో తెలంగాణ పోలీస్ నంబర్ వన్గా నిలిచిందని అన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్లు ఏర్పాటు చేసి భరోసా కల్పిస్తున్నట్టు చెప్పారు. మహిళలు, ఉద్యోగినులు, గృహిణులు ఆర్టీసీ బస్సుల్లో, విద్యార్థినులు స్కూల్ బస్సుల్లో ప్రయాణిస్తుంటారని, వారి భద్రతకు భరోసా కల్పించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పోలీస్ శాఖను అభినందించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 77 బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి మహిళలకు సురక్షిత ప్రయాణం అందిస్తామని చెప్పారు. బస్సుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఆర్టీసీ డిపో, జిల్లా పోలీస్ కార్యాలయాలకు అనుసంధానం చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టైక్స్టైల్, పవర్లూం కార్పొరేషన్ చైర్మన్ గూడురి ప్రవీణ్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు.
ట్విట్టర్ వేదికగా మంత్రి అభినందన
పోలీస్శాఖ ప్రత్యేక చొరవతో ఆర్టీసీ, స్కూల్ బస్సుల్లో సురక్షిత ప్రయాణాన్ని అందించే విధంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ఫొటోలు, సంబంధిత వివరాలను వెల్లడిస్తూ ఎస్పీ అఖిల్ మహాజన్ తన ట్విట్టర్లో పోస్టు చేయగా.. మంత్రి కేటీఆర్ అభినందిస్తూ రీట్వీట్ చేశారు.