హైదరాబాద్ : స్వలాభం కోసం పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ లో శుక్రవారం సుమారు రూ. 97 లక్షల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉప ఎన్నికలలో బీజేపీ ఎమ్మెల్యేలు గెలుపొందిన దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాలలో ఇప్పటి వరకు ఎన్ని నిధులు ఖర్చు చేశారో, ఏం అభివృద్ధి చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ నేతలకు కులాలు, మతాలు గుర్తుకొస్తాయని ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాను ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు ఎన్ని నిధులు తీసుకొచ్చారు.
తనను గెలిపించిన ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. అభివృద్ధి లో పోటీ పడాలి తప్ప నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలకు ఏం మేలు జరగదని హితవు పలికారు. అభివృద్ధి పనులు ఏమైనా చేయాలంటే అది రాష్ట్ర ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్ ల పంపిణీ, రైతుబందు క్రింద రైతులకు పంట పెట్టుబడి అందిస్తున్నామని తెలిపారు.
గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆలోచనతో కులవృత్తులను ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామరక్ష అన్న విశ్వాసంతో ప్రజలు ఉన్నారని, మునుగోడు ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.