చౌటుప్పల్, అక్టోబర్ 9: దేశంలో కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీని మునుగోడు ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఆదివారం నిర్వహించిన కార్మికులు, ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు కార్మికులు తెలంగాణ నుంచి వలస వెళ్లేవారని, సీఎం కేసీఆర్ పాలనా దక్షతతో ఇప్పుడు మన రాష్ట్ర కూలీలతో పాటు పక్క రాష్ర్టాల కూలీలు ఇక్కడ ఉపాధి పొందుతున్నారని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారన్నారు.
మంత్రి కేటీఆర్ చొరవతో ఎన్నో పెద్ద కంపెనీలు ఇక్కడికి వచ్చాయని, దీంతో వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతున్నదని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. దేశ సొత్తును కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నదని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ చేస్తుంది జోడో యాత్ర కాదు.. చోడో యాత్ర అని ఎద్దేవా చేశారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని రూ.18 వేల కోట్లకు బీజేపీకి తాకట్టు పెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
కాగా, సంస్థాన్ నారాయణపురం మండలంలోని రాధానగర్, సీత్యాతండాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ మిడిమిడి జ్ఞానంతో తెలంగాణ బిడ్డల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, గులాబీ సైన్యం తలుచుకుంటే రోడ్డు కూడా ఎక్కలేరని హెచ్చరించారు. మునుగోడులో కారు గెలుపును ఎవరూ ఆపలేరని, బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని ధీమా వ్యక్తం చేశారు.