హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఓ దొంగ అని, ఆయన బతుకంతా బ్లాక్మెయిలింగేనని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విమర్శించారు. రేవంత్రెడ్డి ఇప్పటికి కూడా చంద్రబాబు డైరెక్షన్లోనే పని చేస్తూ.. పార్టీని, రాష్ర్టాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగిన రాజగోపాల్రెడ్డిపై రేవంత్రెడ్డి చేసిన విమర్శలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. తన నివాసంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జైలుకు వెళ్లిన దొంగ నుంచి నీతులు చెప్పించుకునే అగత్యం తమకు పట్టలేదని అన్నారు. తెలంగాణ ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించిన రేవంత్రెడ్డి ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏమిటని ప్రశ్నించారు. అతడు జైలుకు ఎందుకు వెళ్లాడో చెప్పాలన్నారు. పదవులు, రాజకీయ అవసరాల కోసం పార్టీ మారిన చరిత్ర రేవంత్రెడ్డిదని విమర్శించారు. గత ఎంపీ ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి కాకుండా మల్కాజ్గిరి నుంచి ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. మల్కాజ్గిరిలో సెటిలర్స్ ఓట్లతో గెలవచ్చనే ఆలోచనతో ఇక్కడి పోటీ చేశాడని విమర్శించారు.
రేవంత్రెడ్డిది ఎప్పటికీ కాంగ్రెస్ రక్తం కానేకాదని రాజగోపాల్ అన్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీని బలిదేవత అని, రాహుల్ గాంధీని, వైస్ రాజశేఖర్రెడ్డిని, పార్టీని 20 ఏండ్లు తిట్టి ఇప్పుడు కాంగ్రెస్ వ్యక్తినని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. పార్టీలో అసలైన కాంగ్రెస్ వాదులకు చోటు, ప్రాధాన్యం లేకుండా పోతున్నదని చెప్పారు. పార్టీ సీనియర్లు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో పాటు ఎవరూ సంతోషంగా లేరన్నారు. తన గురించి రేవంత్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని, బట్టలూడదీసి కొడుతామని హెచ్చరించారు. రేవంత్రెడ్డి తీరుతో మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదన్నారు.