హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్గా రాజా వరప్రసాద్రావు, సభ్యులుగా మోదల పురుషోత్తం, మహేశ్ నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. వ్యవసాయశాఖలో సహకార యూనియన్ చైర్మన్ చాలా కీలకమైన పదవి. రాష్ట్రంలోని రైతు, మత్స్య, గొర్రెలు, మేకలు, మహిళా తదితర అన్ని సంఘాలకు దిశానిర్దేశం చేసే అధికారాలు చైర్మన్కు ఉంటాయి. దీంతోపాటు సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు రాజేంద్రనగర్ కేంద్రంగా నిరంతరం శిక్షణా తరగతులను నిర్వహిస్తుంది. ఇంతటి కీలక పదవి తనకు దక్కడంపై రాజా వరప్రసాద్రావు సంతోషం వ్యక్తం చేశారు.
తనను గుర్తించి చైర్మన్ పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్కు, సహకరించిన మంత్రి నిరంజన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో రాజా వరప్రసాద్రావు కీలకంగా వ్యవహరించారు. తొలి నుంచీ పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. 2001 నుంచి 2007 వరకు షాద్నగర్ పట్టణ పార్టీ అధ్యక్షుడిగా, 2007 నుంచి 2010 వరకు యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2010 నుంచి 2016 వరకు ఉమ్మడి పాలమూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో అరెస్టయినప్పుడు పెండ్లి పీటలపై నల్లబ్యాడ్జీ ధరించి నిరసన తెలిపారు. ఉద్యమంలో పలుమార్లు జైలు జీవితం, నిర్బంధాలను ఎదుర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడికి కీలక పదవి దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. సభ్యులతో కలిసి రాజావరప్రసాద్రావు ఆదివారం వనపర్తిలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ పదవి వచ్చేందుకు సహకరించినందుకు గానూ ధన్యవాదాలు తెలిపారు.