బరార్ సుబేదార్ అయిన రాజా మహీపత్రామ్ తొలితరం తిరుగుబాటుదారుల్లో ఒకడు. నిజామ్లకు అత్యంత సన్నిహితుడు. బ్రిటిష్ పాలనకు బద్ధ్ద వ్యతిరేకి. సంస్థానం పశ్చిమ ప్రాంత సైన్యాలు ఇతని ఆధీనంలో ఉండేవి. 1804లో హోల్కార్పై బ్రిటిష్ వాళ్లు యుద్ధానికి వెళ్లినప్పుడు మనస్ఫూర్తిగా సహకరించలేదని మహీపత్రామ్పై దొరలు అక్కసు పెంచుకున్నారు.
అరస్తుజా మరణంతో దివాన్ కావాలనుకున్నాడు మహీపత్ రామ్. కానీ బ్రిటిష్ వాళ్లు పొసగనివ్వలేదు. అడ్డుపుల్లలు వేసి అది జరగకుండా చూశారు. బరార్ సుబా బాధ్యతలు వేరేవారికి అప్పగించి 1805 నుంచి నిజాం దివానంలోనే ఎక్కువగా గడిపేవాడు మహీపత్రామ్. ఇతర సంస్థానాధీశులతో చేతులు కలిపి బ్రిటిష్ ఆధిపత్యాన్ని బద్దలు కొట్టవచ్చని నిజాం రాజుకు నూరిపోసేవాడు. ఈయనంటే అపనమ్మకమున్న బ్రిటిషర్లు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచేవారు. కరడుగట్టిన బ్రిటిష్ వ్యతిరేకి అయిన మహీపత్రామ్.. నిజాం సికందర్ జాహ్కు సన్నిహితంగా మెలగడం ఇష్టంలేని బ్రిటిష్ రెసిడెంట్ కుట్రలు పన్ని ఎలాగోలా 1806లో బరార్ వెళ్లిపోయేలా చేశాడు.
అక్కడ నుంచి కూడా ఆయన బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగించడంతో సుబేదార్ పదవి నుంచి తప్పించేలా నిజామ్ను ఒప్పించడంలో రెసిడెంటు, ఆయనకు అనుకూలుడైన దివాన్ మీర్ ఆలం సఫలీకృతులయ్యారు. ఈ కుట్రల ఫలితంగా తన జాగీరుకు పరిమితమైనప్పటికీ తిరుగుబాటు కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. దీని ఫలితంగా అతనిపైకి ముందుగా నిజాం సైన్యాలను పంపించేలా ఒత్తిడి తెచ్చారు బ్రిటిష్వారు. తర్వాత నేరుగా తమ ఆధీనంలోని సైన్యాలనే పంపడంతో మహీపత్ రామ్ ఇండోర్కు పారిపోయాడు. తర్వాత ఏమైపోయాడనేది తెలియలేదు. హైదరాబాద్ కార్యరంగం నుంచి రాజా మహీపత్ రామ్ను తప్పించడం ద్వారా నిజాం ప్రభుత్వంపై బ్రిటిష్ వారు తిరుగులేని ఆధిపత్యం సాధించారు. క్రీ.శ. 1800 సైనిక సహకార ఒప్పందం తర్వాత సంస్థానంపై బ్రిటిష్ ఆధిపత్యానికి అడ్డుకట్టలు వేసేందుకు ప్రయత్నించిన మొట్టమొదటి వ్యక్తిగా మహీపత్రామ్ చరిత్రలో నిలిచిపోయాడు.