హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ)/చెన్నై, డిసెంబర్ 5: మిగ్జాం తుఫాన్ మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటింది. ఇప్పటికే తమిళనాడులో జల విలయానికి కారణమైన తుఫాన్ ఏపీలోనూ బీభత్సం సృష్టించింది. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అటు రాయలసీమ ప్రాంతంలోనూ, ఇటు తెలంగాణలోనూ మిగ్జాం తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యాయి. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 96.8 మి.మీ వర్షం కురిసింది. నేడు, రేపు తెలంగాణలో వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతం సముద్ర తీర రాష్ర్టాలను వణికించిన మిగ్జాం తుఫాన్ తీరం దాటింది. మంగళవారం మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల మధ్య సమయంలో ఏపీలోని బాపట్ల సమీపంలో తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. మిగ్జాం తుఫాన్ ఏపీతో పాటు తమిళనాడులోని తీర ప్రాంత జిల్లాల్లో తీవ్ర నష్టం చేకూర్చింది. వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లోనూ తుఫాను ప్రభావం కనిపించింది.
వరి, పొగాకు, పసుపు, అరటి, పలు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు కురవడంతో చెరువులు, కాలువులు పొంగిపొర్లాయి. పలుచోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. తుఫాను ప్రభావంతో అమరావతిలోని సచివాలయంలో ప్రభుత్వ ఈ -ఆఫీస్ నెట్వర్క్ నిలిచిపోయింది. తుఫాన్ పరిస్థితులపై సీఎం జగన్ మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రజలకు ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలని సూచించారు. తుఫాను సహాయ చర్యల కోసం ప్రభావిత జిల్లాలకు ప్రభుత్వం రూ.22 కోట్లు విడుదల చేసింది. బాపట్ల, గుంటూరు, కృష్ణా, చిత్తూరు తదితర ప్రభావిత జిల్లాల్లో హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది.
ఒడిశా దక్షిణ జిల్లాలపైనా ప్రభావం
మరోవైపు మిగ్జాం తుఫాన్ తమిళనాడు రాజధాని చెన్నై నగరంతో పాటు తొమ్మిది తీర ప్రాంత జిల్లాల్లో కల్లోలం సృష్టించింది. సోమవారం కుండపోత వానలు కురవగా.. మంగళవారం కాస్త విరామం ఇచ్చాయి. భారీ వర్షాల ప్రభావంతో ప్రభావిత ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. వరద నీరు పోటెత్తడంతో లోతట్టు జలమయమయ్యాయి. రహదారులపైకి కూడా పెద్దయెత్తున నీరు చేరడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. విద్యుత్తు సరఫరా, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఒడిశాలోని దక్షిణ జిల్లాలపై కూడా మిగ్జాం తుఫాన్ ప్రభావం చూపింది. మల్కాన్గిరి, కోరపుట్, రాయగఢ, గజపతి, గంజాం జిల్లాల్లో సహాయక చర్యల నిమిత్తం ఐదు విపత్తు నిర్వహణ బృందాలు, ఎనిమిది అగ్నిమాపక విభాగం బృందాలను రంగంలోకి దించినట్టు రాష్ట్ర స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రత సాహు పేర్కొన్నారు.
బోట్లు, ట్రాక్టర్ల సాయంతో..
చెన్నైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం సంబంధిత ప్రమాద ఘటనల్లో 12 మంది మరణించారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. తుఫాను బాధితులను బోట్లు, ట్రాక్టర్లు వంటి వాటిని ఉపయోగించి ఇతర ప్రాంతాలకు తరలించారు. సహాయక, పునరావాస కార్యక్రమాల్లో ఎయిర్ఫోర్స్, నేవీ సిబ్బంది పాలుపంచుకొన్నారు.
అమీర్ఖాన్ను కాపాడిన రెస్క్యూ సిబ్బంది
చెన్నైలోని కరప్పాకం ఏరియాలో వరదల్లో చిక్కుకొన్న పలువురు ప్రముఖులను సహాయక సిబ్బంది కాపాడారు. వీరిలో బాలీవుడు నటుడు అమీర్ఖాన్, మరో నటుడు విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల తదితరులు ఉన్నారు. ఇంట్లోకి నీళ్లు చేరాయని, క్రమంగా ఉధృతి పెరుగుతున్నదని పేర్కొంటూ తాను ఉంటున్న ఏరియాలోని పరిస్థితిని వివరిస్తూ విశాల్ పెట్టిన పోస్టుకు రెస్క్యూ, ఫైర్ సిబ్బంది స్పందించారు. వారు అమీర్ఖాన్, విశాల్, తదితరులను వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వేరే చోటుకు బోటులో తరలిస్తున్న ఫొటోలను విష్ణు విశాల్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే అమీర్ ఖాన్ షూటింగ్ నిమిత్తం ఇక్కడ ఉన్నారని, తమ తల్లికి ఓ దవాఖానలో చికిత్స నిమిత్తం చెన్నైలో ఉంటున్నారని కొంత మంది చెబుతుండగా.. విశాల్ నివాసం ఉండే కరప్పాకంలోని అపార్ట్మెంట్లోనే అమీర్ ఖాన్ కూడా ఉంటున్నట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.