కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి కురిసిన అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాలకు వెళ్లే తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోవడంతో పాటు రోడ్లపై వృక్షాలు విరిగిపడ్డాయి. పలు చోట్ల కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి.
ఆసిఫాబాద్ మండలం గుండి వాగు పై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరదకు కొట్టుకుపోయింది. రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో వాగుకు అవతలవైపు ఉన్న గ్రామాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
రెబ్బెన మండలం కొండపల్లిలో రాళ్ల వర్షం కురిసింది. పెంచికల్పేట్ మండలానికి వెళ్లే రహదారిపై వృక్షాలు విరిగిపడి రాకపోకలు నిలిచి పోయాయి. జిల్లాలో ఉదయం ఏడుగంటల నుంచి సుమారు పది గంటల ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.