నిజామాబాద్/నిర్మల్: ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం (Rain) కురుస్తోంది. బోధన్ (Bodhan), బాన్సువాడ (Banswada) నియోజకవర్గ పరిధిలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వానపడుతున్నది. దీంతో రైతుల్లో మరోమారో గుబులు రేపుతోంది. ధాన్యం రాశులు తడిసి ముద్దయిన పరిస్థితులలో ఆరబెట్టుకునే సమయమే చిక్కకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్లోను వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. నిర్మల్ (Nirmal) జిల్లా భైంసా డివిజన్ పరిధిలో మోస్తరు వర్షాలు కురిశాయి. ముధోల్, కుబీర్, భైంసా (Bhainsa), కుంటాల, తానూర్ మండలాల్లో కూడా వాన కురుస్తున్నది.
రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం భద్రాద్రి -కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, యాద్రాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షం పడనున్నది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని పేర్కొన్నది.