నెట్వర్క్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 30 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొట్టాయి. దాంతో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకొన్నాయి. బుధవారం నాగర్కర్నూల్, పెద్దపల్లి, నిర్మల్, నల్లగొండ, మంచిర్యాల, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో లింగాపూర్ చెరువు నిండి మత్తడి దుంకుతున్నది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండల పరిధిలోని సుద్దాల, నారాయణపూర్, రాయిపేట గ్రామాల్లోని వాగులు ఉప్పొంగుతున్నాయి. సుద్దాల వాగు తాత్కాలిక వంతెన తెగిపోయింది. కిష్టంపేట గ్రామంలో ఒక ఇల్లు కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
నల్లగొండ జిల్లాలో 30 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా గుండ్లపల్లిలో 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి రంగారెడ్డిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొడంగల్ మండలంలో 51 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తిరుమల పుణ్యక్షేత్రంలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇదిలావుండగా, ఈ నెల 10 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.