సంక్రాంతి సందర్భంగా రైల్వే ప్లాట్ఫాం టికెట్ల ధరలను పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ పండుగ వల్ల రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ బాగా పెరుగుతోందని, వారికి తోడుగా వచ్చే బంధువుల సంఖ్య కూడా అధికంగా ఉంటోందని రైల్వేశాఖ తెలిపింది.
ఈ రద్దీని తగ్గించేందుకే ప్లాట్ఫాం టికెట్ ధరలను పెంచాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్యరైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. ఈ నిర్ణయం ప్రకారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.50కు పెంచినట్లు ఆయన వెల్లడించారు.
నాంపల్లి, కాచిగూడ, వరంగల్, ఖమ్మం, లింగంపల్లి, కాజీపేట్, మహబూబ్నగర్, రామగుండం, మంచిర్యాల, భద్రాచలం, వికారాబాద్, తాండూర్, బీదర్, బేగంపేట్ రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధరను రూ.20కు పెంచినట్లు తెలియజేశారు.