హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 : ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుపై ఏపీ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై మంగళవారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసి మాట్లాడానని, ప్రత్యేక విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు రైల్వే మంత్రి హామీ ఇచ్చారని వెల్లడించారు. అతి త్వరలో విశాఖ రైల్వే జోన్ సాకారమవుతుందని, ఇందుకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సిద్ధమైందని తెలిపారు. రైల్వే జోన్ భవన నిర్మాణం కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందని పేర్కొంటూ.. ఇది ఆంధ్రా ప్రజలకు, ప్రత్యేకించి విశాఖ వాసులకు శుభవార్త అని చెప్పారు. రాష్ట్ర విభజన హామీల అమలు కోసం ఏపీ బీజేపీ ఎంపీలు కృషి చేస్తుంటే.. తెలంగాణ బీజేపీ ఎంపీల తీరు మరోలా ఉన్నది. విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన హామీలకు కేంద్ర ప్రభుత్వం ఎగనామం పెడుతున్నా రాష్ట్ర బీజేపీ ఎంపీలు పట్టించుకోవడం లేదు. పైపెచ్చు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడుగడుగునా అడ్డుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీకి చెందిన ఒక కేంద్ర మంత్రి, ముగ్గురు ఎంపీలు ఉన్నప్పటికీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధించుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష హోదాలో ఉన్న ఎంపీ సైతం రాష్ర్టానికి రావాల్సిన రైల్వే ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్టు సాధన కోసం కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరపలేని దుస్థితిలో ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొన్న కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇచ్చే ప్రసక్తే లేదని చెప్తున్నది. మన కాజీపేటలో ఏర్పాటు కావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్రలోని లాతూర్లో ఏర్పాటు చేస్తున్నది. ఈ విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నప్పటికీ రాష్ట్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్ని వినతులిచ్చినా..
రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం హామీ ఇచ్చిన విధంగా కాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించారు. ఇదే విషయమై రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కూడా కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. ఈ వినతులన్నింటికీ పాతరేసిన కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేదేలేదని ప్రకటించడంతో ఇక్కడి యువతకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి. వాస్తవానికి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని కేంద్రం గత బడ్జెట్లో చేర్చినప్పటికీ నిధులు మాత్రం కేటాయించలేదు. ఈ నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ ఊసే లేకుండా పోయింది. దీనిపై టీఆర్ఎస్ నాయకులు, రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే జోనల్ కార్యాలయం ముందు భారీ ధర్నాతో నిరసన గళం వినిపించినా, రైల్వే జీఎంకు వినతి పత్రం ఇచ్చి విజ్ఞప్తి చేసినా కేంద్ర ద్వంద వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో తెలంగాణ ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.