Siddipet Train | హైదరాబాద్ సిటీబ్యూరో/ సిద్దిపేట, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేటలో రైలు కూత వినిపించనున్నది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైలు నేడు సిద్దిపేటకు రానున్నది. సీఎం కేసీఆర్ దశాబ్దాల కల సాకారం కానున్నది. మంగళవారం మధ్నాహ్నం 3 గంటలకు సిద్దిపేట రైల్వేస్టేషన్లో మంత్రి హరీశ్రావు రైలును ప్రారంభించనున్నారు. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న రైల్వేలైన్ పనులు స్వరాష్ట్రంలో వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే గజ్వేల్ వరకు పనులు పూర్తయి రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ఇటీవల సిద్దిపేట వరకు రైల్వేలైన్ నిర్మాణం పూర్తయింది. దాంతో మంగళవారం నుంచి సిద్దిపేట-కాచిగూడకు రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. కాగా, మనోహరాబాద్-సిద్దిపేట రైల్వేస్టేషన్ల మధ్య నూతన రైలు మార్గాన్ని మంగళవారం ప్రధాని మోదీ వర్చువల్గా జాతికి అంకితం చేస్తారని రైల్వే అధికారులు తెలిపారు. ధర్మాబాద్-మనోహరాబాద్, మహబూబ్నగర్-కర్నూల్ రైల్వేస్టేషన్ల మధ్య విద్యుదీకరణను కూడా ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ కృషితో అత్యంత వేగంగా..
2005-06లో యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పు డు రాష్ట్ర ప్రభుత్వ మూలధనం వాటాగా మొ త్తం ఖర్చు భరించి భూసేకరణ, రైల్వే ఏర్పాటుకు అవసరమైన నిధుల్లో మూడో వంతు సమకూర్చడం, రైల్వే నిర్మాణం అనంతరం ఐదేండ్లపాటు రైల్వేకు వచ్చే నష్టాలను రాష్ట్ర ప్ర భుత్వం భరించడం అనే అగ్రిమెంట్తో మనోహరాబాద్ నుంచి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా కొత్తపల్లి కరీంనగర్ వరకు 151 కిలోమీటర్ల రైల్వేలైన్ మంజూరు చేయించారు. నాటి వైఎస్ ప్రభుత్వం రాష్ట్రం వాటాగా నిధులు చెల్లించకపోవడం, భూసేకరణ చేయకపోవడం మూలంగా 2014 వరకు రైల్వే ఏర్పాటు పనులు ప్రారంభం కాలేదు. 2014లో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎం కేసీఆర్ మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 2,200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి రైల్వేశాఖకు ఇవ్వడం వల్ల దేశ చరిత్రలోనే అత్యంత వేగంగా సిద్దిపేట రైల్వేలైన్ పూర్తయింది. దేశంలో ప్రథమంగా ఒక కోర్టు కేసు కూడా లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలిగారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.1000 కోట్ల వరకు వెచ్చించింది. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ, మంత్రి హరీశ్రావు ప్రత్యేక కృషితోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయింది.
4జిల్లాలో రైల్వేలైన్ పొడవు 151.36 కి.మీ
సికింద్రాబాద్ -మన్మాడ్ వెళ్లే మార్గంలో మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి రైల్వేలైన్ ప్రారంభమై సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట మీదుగా రాజన్న సిరిసిల్లలోని సిరిసిల్ల, వేములవాడ, బోయినిపల్లి మీదుగా కరీంనగర్ జిల్లాలోని వెదిర మీదుగా పెద్దపల్లి- నిజామాబాద్ వెళ్లే మార్గంలో కొత్తపల్లి వద్ద ఈ లైన్ కలుస్తుంది. ఈ రైల్వేలైన్ పొడవు 151.36 కిలోమీటర్లు. రూ.1160.47 కోట్ల అంచనా తో పనులను ప్రతిపాదించారు. రైల్వేలైన్ ని ర్మాణానికి సుమారుగా 2,200 ఎకరాలు అవసరం ఉండగా సిద్దిపేట జిల్లాలో పూర్తిస్థాయి లో భూసేకరణ పూర్తి చేసి రైల్వేశాఖకు అప్పగించి పనులు పూర్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 954 ఎకరాల భూసేకరణకుగాను 808 ఎకరాల భూసేకరణ పూర్తి చేశారు. రైల్వేలైన్ నాలుగైదు దశల్లో పనులు చేపట్టేలా అధికారులు ప్రణాళికలు రచించి పనులు చేశారు. మెదక్ జిల్లాలో 9.30 కి.మీ, సిద్దిపేట జిల్లాలో 83.40 కి.మీ, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 37.80 కి.మీ, కరీంనగర్ జిల్లాలో 20.86 కి.మీ మేర మొత్తం 151.36 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణం చేస్తారు. నాలుగు జిల్లాలో మొత్తం 15 రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు.