రంగారెడ్డి, ఫిబ్రవరి 23 : కేంద్రప్రభుత్వం అంతులేని వివక్ష చూపినా.. రాష్ట్ర అభివృద్ధి పరుగులకు అడ్డుపుల్లలేసి ఆపాలని ప్రయత్నిస్తున్నా.. తెలంగాణ ప్రభ ఏమాత్రం మసకబారటంలేదు. ప్రపంచ పారిశ్రామికరంగానికి సరికొత్త డెస్టినేషన్గా అవతరించిన తెలంగాణ, ఇప్పుడు మరో ఘనతను సాధిం చేందుకు చేరువైంది. వరంగల్ జిల్లా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతామని కేంద్రం హామీ ఇచ్చి చివరకు మొండిచెయ్యి చూపినా, రైల్ కోచ్ల తయారీకి కేంద్రంగా నిలిచేందుకు తెలంగాణ వడివడిగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్గా మారిన రంగారెడ్డి జిల్లాలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధమైంది. జిల్లాలోని శంకర్పల్లి మండలం కొండకల్లో మేధా సంస్థ నిర్మిస్తున్న కోచ్ ఫ్యాక్టరీ వచ్చే నెలలో ప్రారంభం కానున్నది. దీంతో ప్రైవేటు రంగంలో అత్యాధునిక టెక్నాలజీతో ప్రపంచ స్థాయి రైల్ కోచ్లను తయారుచేసే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందనున్నది. ఈ ఫ్యాక్టరీని సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. దీని నిర్మాణ పనులను 2020 ఆగస్టులో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇందులో మెట్రో రైల్ బోగీలతోపాటు మోనో రైల్, కోచ్లు, ఇంటర్సిటీ, లోకో మోటివ్స్ కూడా ఉత్పత్తి కానున్నాయి.
ఏడాదికి వెయ్యి బోగీల ఉత్పత్తి
ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చిన మేధా సంస్థకు రాష్ట్రప్రభుత్వం మొదటినుంచీ సంపూర్ణ సహకారం అందిస్తూ వస్తున్నది. టీఎస్ఐఐసీ ద్వారా భూములు కేటాయించింది. దేశంలో ప్రైవేటు రంగంలో ఏర్పాటైన కోచ్ ఫ్యాక్టరీల్లో కొండకల్ ఫ్యాక్టరీ మూడోది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్థ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేసింది. ఇందులో మెట్రో, ఎలక్ట్రిక్ మల్టీపుల్ యూనిట్స్, రైళ్ల లోకోమోటివ్ బోగీలు, ప్యాసింజర్ కోచ్లు తయారు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో సీఆర్ఆర్సీ ఇండియా సంస్థ మెట్రో రైళ్లను తయారు చేస్తున్నది. ఈ రెండు సంస్థలకు మించి అన్ని రకాల రైళ్ల కోచ్లను కొండకల్ ఫ్యాక్టరీలో తయారు చేయనున్నారు. ఈ ఫ్యాక్టరీలో ఏడాదికి వెయ్యి బోగీలను తయారుచేయనున్నట్టు మేధా సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. రోజుకు 4-5 బోగీలు ఉత్పత్తి అవుతాయని వెల్లడించారు.
ప్రారంభానికి ముందే రూ.600 కోట్ల ఆర్డర్
కొండకల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి ముందే భారీ ఆర్డర్ సాధించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మోనో రైలు ప్రాజెక్టు విస్తరణలో భాగంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ ఆథారిటీ 10 మోనో రైల్ రేక్స్ కోసం ఆర్డర్ ఇచ్చినట్టు చెప్పారు. ఈ ఆర్డర్ విలువ దాదాపు రూ.600 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా సుమారు 2 వేల మందికి ఉపాధి లభించనున్నది.