మంత్రాలయం, ఆగస్టు 13: మంత్రాలయం రాఘవేంద్రస్వామి 351వ సప్త ఆరాధనోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఏపీ కర్నూలు జిల్లాలోని శ్రీమఠంలో శనివారం మధ్యారాధన నిర్వహించారు. ఉత్సవ మూర్తి ప్రహ్లాదరాయలు నవరత్న సింహాసనంపై శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల జయజయ ధ్వానాలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ఊరేగారు. ఉదయం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి అభిషేకం చేశారు. అంతకుముందు గ్రామ దేవత మంచాలమ్మకు పూజలు నిర్వహించారు. టీటీడీ అధికారులు మూల బృందావనానికి పట్టు వస్ర్తాలు సమర్పించారు.